షాకింగ్.. బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకలు
ABN , First Publish Date - 2021-06-12T19:32:50+05:30 IST
జీర్ణాశయంలో పేరుకుపోయిన 2 కిలోల వెంట్రుకలను తొలగించి
- తన వెంట్రుకలు తనే లాక్కుని తినేది..!
- ప్రపంచంలో 68వ కేసుగా గుర్తింపు
- సర్జరీ చేసి తొలగించిన ఉస్మానియా వైద్యులు
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : జీర్ణాశయంలో పేరుకుపోయిన 2 కిలోల వెంట్రుకలను తొలగించి, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఓ బాలికను రక్షించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీ కేవలం 68 మందికి మాత్రమే జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గగన్పహాడ్ ప్రాంతానికి చెందిన పూజిత(17) గత ఐదు నెలలుగా తన తల వెంట్రుకలను మింగేస్తోంది. దీంతో అవి కడుపులో పేరుకుపోయి, మూడు నెలలుగా కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఆ అనారోగ్యాన్ని గుర్తించిన ఆమె సోదరి సంధ్య, గత నెల 24న బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చింది. పరీక్షల అనంతరం బాలికకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో.. ఆమెను హోం ఐసొలేషన్లో ఉంచారు.
31న ఆమె కోలుకోవడంతో, అదే రోజు ఆస్పత్రిలో చేర్చుకుని ఉదరభాగానికి పలు పరీక్షలు నిర్వహించారు. ఆమె కడుపులోని జీర్ణాశయం నుంచి చిన్న పేగు వరకు వెంట్రుకలు పేరుకుపోయినట్లు వాటిలో తేలింది. ఈ నెల 2న వైద్యుల బృందం పూజితకు శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులో ఉన్న సుమారు రెండు కిలోల వెంట్రుకలను తొలగించారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమై ఉంటే.. ఆమె ప్రాణాలకే ప్రమాదం వాటిల్లి ఉండేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. శస్త్ర చికిత్స అనంతరం పూజిత ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశామని ఆయన తెలిపారు.