22-ఎ ఫైళ్లపై అప్పిలేట్ అథారిటీ
ABN , First Publish Date - 2020-10-21T17:05:08+05:30 IST
భూముల క్లాసిఫికేషన్కు సంబంధించి 22- ఎలో వున్న భూములపై వివాదాల పరిష్కారానికి అప్పిలేట్ అథారిటీ ఏర్పాటు చేయాలని..
ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం
సిట్ చైర్మన్ విజయ్కుమార్
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): భూముల క్లాసిఫికేషన్కు సంబంధించి 22- ఎలో వున్న భూములపై వివాదాల పరిష్కారానికి అప్పిలేట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్టు సిట్ చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22-ఎ భూములపై 2015లో హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం 2016లో ఉన్నత స్థాయి కమిటీ వేసిందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అప్పిలేట్ అఽథారిటీ అవసరమన్నారు. ఒక్కొక్కసారి సబ్ డివిజన్ కానందున జిరాయితీ భూములు కూడా 22-ఎలో ఉండిపోతున్నాయన్నారు. అప్పిలేట్ అథారిటీతో వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. విశాఖలో భూ అక్రమాలకు సంబంధించి వచ్చే నెలాఖరుకు విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో సిట్ సభ్యులు వైవీ అనురాధ, వి.భాస్కరరావు పాల్గొన్నారు.