గంజాయి కేసులో 23 మంది అరెస్టు
ABN , First Publish Date - 2020-06-03T10:20:20+05:30 IST
గంజాయి కేసులో ముగ్గురు మైనర్లతో సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
బొబ్బిలికి చెందిన వ్యక్తే సూత్రధారి
శ్రీకాకుళం క్రైం, జూన్ 2: గంజాయి కేసులో ముగ్గురు మైనర్లతో సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసుల కథనం మేరకు... శ్రీకాకుళం నగరంలో గంజాయి మత్తులో యువకులు నేరాలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు ఇటీవల తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట నలుగురు గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కారు. గంజాయి ఎలా లభించిందన్న విషయంపై వీరిని విచారించారు. విజయనగరం జిల్లా బొబ్బిలితో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి యువకులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈమేరకు బొబ్బిలికి చెందిన యర్రంశెట్టి కిరణ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కిరణ్కుమార్ను పట్టుకొనేందుకు పోలీసులు ముందుగా గంజాయి కేసులో పట్టుబడినవారి ద్వారా అతని ఖాతాకు నగదును బదిలీ చేయించారు. దీంతో అతన్ని పట్టుకోవడం సులువైంది. అనంతరం ఈ గంజాయి వ్యవహారంతో సంబంధమున్న 23 మందిపై టూటౌన్ సీఐ పి.వెంకటరమణ మంగళవారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరి నుంచి 19 సెల్ఫోన్లు, రూ.ఆరు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.