25 నుంచి primary schools
ABN , First Publish Date - 2021-10-19T17:31:56+05:30 IST
రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు తెరిచేందుకు ముహూర్తం ఖరారయింది. ఈనెల 25 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రాథమిక పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం విధానసౌధలో కొవిడ్ టాస్క్ఫోర్స్
- టాస్క్ఫోర్స్, మంత్రులతో చర్చించి సీఎం నిర్ణయం
- కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశం
bengaluru: రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు తెరిచేందుకు ముహూర్తం ఖరారయింది. ఈనెల 25 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రాథమిక పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం విధానసౌధలో కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీతోపాటు వివిధశాఖల మంత్రులతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చర్చలు జరిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన మేరకు ప్రాథమిక పాఠశాలలు తెరవాలని నిర్ణయించారు. 25 నుంచి అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, పాఠశాలకు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతులు అవసరమని, తరగతి గదిలో 50 మందికి మించి విద్యార్థులు ఉండరాదని, ప్రతిపాఠశాలలోనూ థర్మల్ స్ర్కీనింగ్ అమలు చేయాలని, భౌతికదూరం తరగతి గదిలోనూ, పాఠశాల ప్రాంగణంలోనూ పాటించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్ రెండోవిడత తగ్గుముఖం పట్టడం, మూడోవిడత ప్రభావం లేకపోవడంతోనే ప్రాథమిక పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం తీర్మానించింది. తొలుత డిగ్రీ కళాశాలలు, ఆ తర్వాత 9 నుంచి పీయూ ద్వితీయ, ఇటీవలే 6 నుంచి 8వ తరగతులను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. ఈమేరకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకమైన విద్య తరగతి గది ద్వారానే సాధ్యమని తీర్మానించామన్నారు. వైద్యనిపుణుల అభిప్రాయం మేరకే పాఠశాలలు తెరుస్తున్నామన్నారు. కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గినందున అనుకూలమైందన్నారు. మొదటివారం సగం రోజు మాత్రమే పాఠశాలలు ఉంటాయని, నవంబరు నుంచి పూర్తిస్థాయిలో తరగతులు కొనసాగుతాయన్నారు. నవంబరులోనే మధ్యాహ్న భోజనం అమలు చేస్తామన్నారు. పాఠ్యాంశాలు కుదించే ఆలోచన లేదన్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలు రోజు విడిచిరోజు పనిచేస్తున్నాయని అదే తరహాలోనే ఎల్కేజీ, యూకేజీ క్లాసులు కొనసాగించదలిచామన్నారు. 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ వేసేందుకు ఇంకా మార్గదర్శకాలు రాలేదని, వైద్యశాఖ సూచనలు చేస్తే పాఠశాలలోనే అమలు చేసే ఆలోచన ఉందని మంత్రి నాగేశ్ తెలిపారు. పాఠశాలల్లో వ్యాక్సినేషన్ అమలు చేస్తే అందరికీ సులభతరంగా టీకాలు వేసినట్టు అవుతుందన్నారు.