ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు: ప్రియాంక
ABN , First Publish Date - 2021-10-19T20:19:44+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 టిక్కెట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 టిక్కెట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతను సమీక్షిచేందుకు మంగళవారంనాడు లక్నోలో ప్రియాంక ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను ఆమెకు పార్టీ అధిష్టానం అప్పగించింది.
యూపీ ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు మహిళలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక తెలిపారు. గత కొద్ది నెలలుగా ప్రియాంక యూపీలో వరుస పర్యటనలు సాగిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో తరచు సమావేశమమవుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ లక్నోకు షిఫ్ట్ అయ్యేందుకు కూడా ప్రస్తుతం ఆమె ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ పునరుద్ధరణకు, పూర్తి శక్తియుక్తులతో వచ్చే అసెంబ్ల ఎన్నికల్లో పోరాటం చేసేందుకు పార్టీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. బ్లాక్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలని, కమిటీలుగా ఏర్పాడి ప్రజలకు చేరువ కావాలని పార్టీ కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రియాంక లక్నోలో ఉంటూ ఎన్నికల ప్రచారానికి అవసరమైన వ్యూహరచనతో పాటు 75 జిల్లాల్లో పర్యటనలను సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పొత్తుల సాధ్యాసాధ్యాలు, వ్యూహరచనలో కీలక భూమిక పోషించనున్నారు. లఖింపూర్ హింస అనంతరం ప్రియాంక ప్రజలతో మరింత మమేకమవుతున్నారు. ఈ ఘటనపై ప్రియాంక స్పందన సైతం పార్టీ అధిష్ఠానం ప్రశంసలు అందుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అయితే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.