జిల్లాకు 47వేల క్వింటాళ్ల వేరుశనగ
ABN , First Publish Date - 2021-05-18T05:49:31+05:30 IST
జిల్లాకు 47వేల క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ ప్రభుత్వం కేటాయించిందని ఇన్చార్జి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం డోన్ మండలం ఉంగరానిగుండ్ల గ్రామంలో సబ్సిడీ వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు.
- 40 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ
- ఇన్చార్జి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
డోన్, మే 17: జిల్లాకు 47వేల క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ ప్రభుత్వం కేటాయించిందని ఇన్చార్జి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం డోన్ మండలం ఉంగరానిగుండ్ల గ్రామంలో సబ్సిడీ వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో 40 శాతం సబ్సిడీతో అర్హులైన రైతులకు వేరుశనగ పంపిణీ చేస్తామన్నారు. ఎకరా పొలం కన్నా తక్కువ ఉంటే ఒక బస్తా, ఎకరా ఉంటే రెండు బస్తాలు, ఆపైన ఎంత ఉన్నా మూడు బస్తాల వేరుశనగ ఇస్తామని తెలిపారు. రైతుభరోసా కింద జిల్లాకు రూ.275 కోట్లు వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ రామచంద్రుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగటి రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి షఫీ పాల్గొన్నారు.
వేరుశనగ పంపిణీపై కరోనా ఎఫెక్ట్
- భయంతో కొనుగోలుకు ముందుకు రాని రైతులు
- మొదటిరోజు 2,820 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్), మే 17: జిల్లాలో సబ్సిడీ వేరుశనగ పంపిణీపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈసారి వేరుశగనకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏపీ సీడ్స్ అధికారులు కే-6 రకం వేరుశనగ కాయలను కొనుగోలు చేసి 350 ఆర్బీకే కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. మొదటి రోజు నుంచే భారీగా డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కరోనా గ్రామాల్లో కూడా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు సోమవారం 2,820 క్వింటాళ్లు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. అర్హులైన ప్రతి రైతుకూ వేరుశనగ కాయలను రాయితీపై అందిస్తున్నామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సీడ్స్ డీఎం శ్రీనివాసులు తెలిపారు.