రాజస్థాన్ సఫారీలో కాపలాదారుతో విదేశీ యువతి ప్రేమాయణం... 50 ఏళ్ల తరువాత...
ABN , First Publish Date - 2021-04-04T12:46:07+05:30 IST
ప్రేమకు వయసుతో పనిలేదు... సరిహద్దులు అంతకన్నా లేవు.
జైసల్మేర్: ప్రేమకు వయసుతో పనిలేదు... సరిహద్దులు అంతకన్నా లేవు. ఈ వాక్యాలతో పెనవేసుకున్న ఉదంతం రాజస్థాన్లోని జైసల్మేర్లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన 82 ఏళ్ల కాపలాదారును ప్రేమించిన యువతి 50 ఏళ్ల తరువాత విదేశాల నుంచి వస్తోంది. తన ప్రేమికుడిని కలిసేందుకు ఆమె ఆస్ట్రేలియా నుంచి వస్తోంది. హ్యూమన్ ఆఫ్ బాంబేకు చెందిన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఆసక్తికర ఉదంతానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
ఈ కథ జైసల్మేర్ పరిధిలోని కుల్ధరా గ్రామానికి చెందిన గేట్కీపర్కు చెందినది. 1970 వ దశాబ్దంలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువతి భారత్లోని రాజస్థాన్లో పర్యటించేందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె జైసల్మేర్కు చెందిన ఈ గేట్కీపర్ ప్రేమలో పడింది. ఈ సందర్బంగా ఆ గేట్కీపర్ మాట్లాడుతూ తనకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తొలిసారి మరీనాను కలుసుకున్నానని, ఆమె రేగిస్తాన్ సఫారీ కోసం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా తాను ఆమెకు ఒంటె సఫారీ నేర్పించానన్నాడు. ఈ సమయంలోనే తమ మనసులు కలిశాయన్నాడు. అయితే ఐదు రోజుల తరువాత ఆమె తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయిందన్నాడు. కొంతకాలం తరువాత తాను రూ. 30 వేల రుణం తీసుకుని, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వెళ్లానన్నాడు. అయితే మరీనా పెళ్లి తరువాత చౌకీదార్ అక్కడే ఉండిపోవాలని కోరుకుంది. అయితే చౌకీదార్ భారత్ తిరిగి వచ్చేశాడు. రాజస్థాన్కు తిరిగి వచ్చిన చౌకీదార్ కొంతకాలం తరువాత మరో యువతిని వివాహం చేసుకున్నాడు. గేట్కీపర్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం అతని భార్య కన్నుమూసింది. పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. ఇంతలో ఉన్నట్టుండి చౌకీదార్కు మరీనా నుంచి లెటర్ వచ్చింది. దీంతో చౌకీదార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరీనా తాను భారత్ వస్తున్నానంటూ ఆ లేఖలో రాసింది. ఈ ఉత్తరం చూడగానే తన జీవితంలో మళ్లీ తొలిప్రేమ చిగురిస్తున్నదని చౌకీదార్ సంబరపడిపోతున్నాడు.