లాక్ డౌన్ కొనసాగించాలా? ప్రజల మనసులో ఏముందంటే..
ABN , First Publish Date - 2020-04-10T03:43:37+05:30 IST
88 శాతం మంది లాక్ డౌన్ కొనసాగింపుకే ఓటేస్తున్నారట
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం తప్ప మరోమార్గం కనిపించట్లేదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇటువంటి నియమాలు పాటించడం దాదాపు అసాధ్యం కాబట్టి ప్రభుత్వాలు లాక్ డౌన్ వంటి కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి. భారత్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. లాక్ డౌన్ కొనసాగిస్తే మంచిదని ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించారు. మరి ఈ పరిస్థితిపై ప్రజలు ఏమనుకుంటున్నారు. లాక్ డౌన్ కొనసాగింపుకే వారు మొగ్గుచూపుతున్నారా? ప్రైవేటు సంస్థల్లో కరోనా పరీక్షలు జరపడంపై వారి అభిప్రాయమేమిటి? సరిగ్గా ఇటువంటి ప్రశ్నలకే సమాధానం వెతికే ప్రయత్నం చేసింది ఇన్షార్ట్స్ అనే వార్తల వెబ్సైట్. తమ యాప్ను వినియోగించే 40 వేల మంది వినియోగదారులపై ఇలాంటి ప్రశ్నలు సంధించింది. వారి సమాధానలు విశ్లేషించిన మీదట.. దాదాపు 88 శాతం మంది లాక్ డౌన్ కొనసాగింపుకే ఓటేస్తున్నారని తెలిపింది. అంతే కాకుండా.. 92 శాతం ప్రైవేటు సంస్థలు కరోనా పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కూడా అభ్రిప్రాయపడ్డారని తెలిపింది.