9 వేల మంది తబ్లిగి జమాత్‌ సభ్యులకు క్వారంటైన్

ABN , First Publish Date - 2020-04-02T22:55:14+05:30 IST

తబ్లిగి జమాత్ సభ్యులను, వారిని కలిసినవారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది.

9 వేల మంది తబ్లిగి జమాత్‌ సభ్యులకు క్వారంటైన్

న్యూఢిల్లీ : తబ్లిగి జమాత్ సభ్యులను, వారిని కలిసినవారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  గురువారం పేర్కొంది. కరోనా వైరస్ సోకే అవకాశం ఉందనే కారణంతో దాదాపు 9,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపింది. 


ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారిలో వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో చాలా మందికి  వారి రాష్ట్రాల్లో చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ జమాత్‌లో పాల్గొన్న 8 మంది విదేశీయులను క్వారంటైన్‌కు పంపించారు. వీరు ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, బ్రిటన్ దేశాలకు చెందినవారు. వీరి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. 


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పీఎస్ శ్రీవాస్తవ విలేకర్లతో మాట్లాడుతూ ఢిల్లీలోని 1,804 మంది తబ్లిగి జమాత్ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు. 334 మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రులలో చేర్పించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన కృషి ఫలితంగా తబ్లిగి జమాత్ కార్యకర్తలు, సభ్యులను ఆసుపత్రులకు, క్వారంటైన్ సెంటర్లకు తరలించగలిగినట్లు తెలిపారు.



మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న 72 మంది గుజరాతీలలో ఒకరు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయింది. భావ్ నగర్‌కు చెందిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ శివానంద్ ఝా విలేకర్ల సమావేశంలో తెలిపారు. మిగిలిన 71 మందిని క్వారంటైన్‌కు తరలించారు.


Updated Date - 2020-04-02T22:55:14+05:30 IST