పుణేలో గంజాయి సాగు చేసిన రైతు అరెస్టు
ABN , First Publish Date - 2020-06-07T01:34:43+05:30 IST
గంజాయి సాగు చేస్తున్న ఓ రైతును పుణే గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.
పుణే : గంజాయి సాగు చేస్తున్న ఓ రైతును పుణే గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. పుణే జిల్లాలోని దౌండ్ తాలూకా, గిరిమ్ గ్రామంలో దత్తు శంకర్ షిండే (47) తన భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు, ఆయనను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచినట్లు పోలీసులు తెలిపారు.
దౌండ్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సునీల్ మహదిక్ తెలిపిన వివరాల ప్రకారం, అత్యంత విశ్వసనీయ సమాచారం అందడంతో పుణే గ్రామీణ పోలీసులు శుక్రవారం గిరిమ్ గ్రామంలోని షిండే భూమిలో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 సెంట్ల భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. 173 గంజాయి మొక్కలను, 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.
నిషేధిత గంజాయిని సాగు చేసినందుకు షిండేపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. షిండేను కోర్టులో హాజరుపరచారు. ఆయనను తదుపరి ప్రశ్నించేందుకు వీలుగా రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు రిమాండ్ విధించింది.