ఆలయం కోసం స్థలాన్ని దానంగా ఇచ్చేసిన ముస్లిం
ABN , First Publish Date - 2020-08-04T15:25:36+05:30 IST
ఆలయం కోసం స్థలాన్ని దానంగా ఇచ్చేసిన ముస్లిం
చెన్నై: తమిళనాడులోని కారైక్కాల్ సమీపంలో నిర్మించనున్న ఆలయానికి స్థలాన్ని దానంగా ఇచ్చి ఓ ముస్లిం ప్రముఖుడు మతసామరస్యాన్ని చాటాడు. కారైక్కాల్ జిల్లా కీళకాసకుడి కాంచీపురం ఆలయ ప్రాంతంలో రోడ్డు పక్కన మునీశ్వరన్ విగ్రహం ఉంది. ఆ ప్రాంతంలో వినాయకుడు, మరమునీశ్వరన్, సముద్రదుర్గ తదితర స్వాములకు వేర్వేరుగా ఆలయాలు నిర్మించారు. కారైకుడికి చెందిన పారిశ్రామికవేత్త చిన్నతంబి అలియాస్ అబ్దుల్ ఖాదర్ ఈ ప్రాంతంలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ఆలయానికి అందించాలని ఆలయ నిర్వాహకులు అబ్దుల్ ఖాదర్ను కోరారు. ఇందుకు అంగీకరించిన ఖాదర్.. పుదుచ్చేరి విద్య, వ్యవసాయశాఖ మంత్రి ఆర్.కమలకన్నన్ నేతృత్వంలో స్థలానికి సంబంధించిన పత్రాలను ఆలయ నిర్వాహకులు పసుపతికి అందజేశారు. ఈ విషయమై అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు 1,200 చదరపు అడుగుల స్థలాన్ని దానంగా అందజేశానన్నారు. అలాగే, ఆలయానికి వెనుక వైపున్న 3 వేల చదరపు అడుగుల స్థలంలో పార్క్ ఏర్పాటుకు కారైక్కాల్ మున్సిపాలిటీకి అందజేశానని తెలిపారు.