పాకిస్థాన్ ఒత్తిడితో అబ్దుల్లా, ముఫ్తీ పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించారు : సత్యపాల్ మాలిక్

ABN , First Publish Date - 2020-05-23T23:22:53+05:30 IST

గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాను జమ్మూ-కశ్మీరు గవర్నర్‌గా పని చేసిన

పాకిస్థాన్ ఒత్తిడితో అబ్దుల్లా, ముఫ్తీ పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించారు : సత్యపాల్ మాలిక్

పనాజీ : గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాను జమ్మూ-కశ్మీరు గవర్నర్‌గా పని చేసిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. జమ్మూ-కశ్మీరులో హింస లేకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడంలో తాను విజయం సాధించినట్లు తెలిపారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతంలోని అగ్ర శ్రేణి నాయకులు పాకిస్థాన్ ఒత్తిళ్ళ వల్ల సహకరించకపోయినప్పటికీ, తాను పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగానని తెలిపారు. 


సత్యపాల్ మాలిక్ జమ్మూ-కశ్మీరు గవర్నర్‌గా 2019 అక్టోబరు వరకు పని చేశారు. ఆ తర్వాత ఆయన గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 


జమ్మూ-కశ్మీరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు చెప్పారన్నారు. తాను నిబంధనలను పక్కనబెట్టి ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల నివాసాలకు వెళ్ళి, సహకరించాలని కోరినట్లు తెలిపారు. పాకిస్థాన్ ఒత్తిడి వల్ల వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో పాలుపంచుకునేందుకు తిరస్కరించారన్నారు. ఉగ్రవాదులు కూడా బెదిరించారని, అయినప్పటికీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. హురియత్ ఈ ఎన్నికలను బహిష్కరించిందన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల మినహా, ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైందన్నారు.  ఎటువంటి హింస జరగలేదన్నారు. 


ఈ విజయానికి కారణం జమ్మూ-కశ్మీరు ప్రజలు ఈ వ్యవస్థను అంగీకరించడమేనని, అది వారికి లబ్ధి చేకూర్చిందని చెప్పారు. 


Updated Date - 2020-05-23T23:22:53+05:30 IST