ఫ్రెండ్‌కు బైక్ ఇచ్చాడు.. ప్రధాన నిందితుడయ్యాడు!

ABN , First Publish Date - 2021-02-23T06:27:40+05:30 IST

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వైద్య విద్యార్థినికి బైకు ఇచ్చి ఆమె మృతికి కారణమైన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఫ్రెండ్‌కు బైక్ ఇచ్చాడు.. ప్రధాన నిందితుడయ్యాడు!

హైదర్‌నగర్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వైద్య విద్యార్థినికి బైకు ఇచ్చి ఆమె మృతికి కారణమైన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కడప జిల్లా బద్వేల్‌ మండలం శాస్ర్తీనగర్‌కు చెందిన మేదా చంద్రశేఖర్‌ కుమార్తె ఆది రేష్మ(20) కర్ణాటక రాష్ట్రం గుల్‌బర్గాలోని హెచ్‌కేఈఎస్‌ఎస్‌ నింగ్‌లింగపాడు డెంటల్‌ కళాశాలలో చదువుతోంది. నగరానికి వచ్చిన సందర్భంగా ఈ నెల 20న తన స్నేహితుడు అజయ్ సింగ్, మరికొందరు స్నేహితుల‌తో కలిసి మియాపూర్‌లోని జీఎస్ఎం మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లారు. తిరిగొచ్చే సమయంలో అజయ్ సింగ్ నడుపుతున్న స్కూటీ(టీఎస్07ఎఫ్‌క్యూ4517)పై రేష్మ వెనుక కూర్చొంది. అయితే రాత్రి 11.40 గంటలకు మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని అజయ్ నుంచి రేష్మ స్కూటీని తీసుకుంది. కొంతదూరం నడిపిన తర్వాత హైదర్‌నగర్‌ వద్ద రేష్మ నడుపుతున్న బైకును వాటర్‌ ట్యాంకర్‌ ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బైకు కింద పడింది. ట్యాంకర్‌ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. హెల్మెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా రేష్మకు అజయ్‌ తన బైకు ఇచ్చాడు. ఆమెకు డ్రైవింగ్ రాదనే విషయం తెలిసీ బైక్ ఇచ్చిన అజయ్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ కృష్ణ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో బైక్ యజమానిని ప్రధాన నిందితుడిగాను, ట్యాంకర్ డ్రైవర్‌ను రెండో నిందితుడిగాను చేర్చారు.

Updated Date - 2021-02-23T06:27:40+05:30 IST