ఏటిగడ్డ వాగు దాటి వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-12-08T06:12:05+05:30 IST
తంబళ్లపల్లె మండలంలోని కోసువారిపల్లె పీహెచ్సీ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయడానికి పెద్దేరు ప్రాజెక్టు మొరవ దాటారు.
తంబళ్లపల్లె, డిసెంబరు 7: మండలంలోని కోసువారిపల్లె పీహెచ్సీ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయడానికి పెద్దేరు ప్రాజెక్టు మొరవ దాటారు. మండలంలోని కొటాల ఏటిగడ్డ వద్ద బ్రిడ్జిపై పెద్దేరు వాగు ప్రవహిస్తోంది. 20 రోజులుగా వాగుకు అటువైపు వున్న సుమారు 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ క్రమంలో హెల్త్ అసిస్టెంట్ కృష్ణానాయక్, ఏఎన్ఎంలు సితార్బి, అరుణకుమారి వాగు దాటి గ్రామాలకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. భుజాలపై వ్యాక్సిన్ కిట్ పెట్టుకుని ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని నెమ్మదిగా వాగు దాటి ఎద్దులవేమన్నకోట, బోనాసివారిపల్లె, తొట్లివారిపల్లెలకు వెళ్లి 32 మందికి కొవిడ్ టీకాలు వేశారు. వాగు దాటుకుని వెళ్లి టీకాలు వేసిన సిబ్బందిని వైద్యాధికారి నిరంజన్కుమార్రెడ్డి అభినందించారు.