తీవ్ర అస్థిరత అంచున దేశం : ఆఫ్ఘన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-08-14T21:17:31+05:30 IST

తీవ్రమైన అస్థిరత ప్రమాదంలో ఆఫ్ఘనిస్థాన్ ఉందని ఆ దేశ అధ్యక్షుడు

తీవ్ర అస్థిరత అంచున దేశం : ఆఫ్ఘన్ అధ్యక్షుడు

కాబూల్ : తీవ్రమైన అస్థిరత ప్రమాదంలో ఆఫ్ఘనిస్థాన్ ఉందని  ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. ఈ పరిస్థితులపై స్థానిక నేతలతోనూ, అంతర్జాతీయ భాగస్వాములతోనూ చర్చిస్తున్నానని శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. 


తాలిబన్లు తమ ప్రాబల్యాన్ని క్షణక్షణం పెంచుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌కు దక్షిణ దిశలో ఉన్న ప్రావిన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అష్రఫ్ ఘనీ రికార్డెడ్ సందేశం మీడియాలో ప్రసారమైంది. సాయుధ దళాలను మోహరించడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘మరింత అస్థిరత  ఏర్పడటాన్ని, హింస పెచ్చరిల్లడాన్ని, నా ప్రజలు నిరాశ్రయులు కావడాన్ని నిరోధించడంపై మీ అధ్యక్షుడిగా నేను ప్రధానంగా దృష్టి పెడుతున్నాను’’ అని చెప్పారు. 


అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఘనీ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో అత్యధిక భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నగరం కాబూల్‌కు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అమెరికా నేతృత్వంలోని దళాలు ఈ నెలాఖరుకు పూర్తిగా ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపోతాయి. 



Updated Date - 2021-08-14T21:17:31+05:30 IST