రైతులకు మద్దతుగా పలుచోట్ల ఆందోళనలు
ABN , First Publish Date - 2020-12-04T06:20:29+05:30 IST
వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆరిలోవ టీఐసీ పాయింట్ వద్ద గురువారం ఉదయం ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఆరిలోవ, నవంబరు 3: వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆరిలోవ టీఐసీ పాయింట్ వద్ద గురువారం ఉదయం ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నగర నాయకురాలు బి.సూర్యామణి, ఎస్.రంగమ్మ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి పి.మణి, ప్రజానాట్యమడలి కార్యదర్శి వై.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
కొమ్మాదిలో సీపీఎం నాయకుల అరెస్టు
కొమ్మాది: ఢిల్లీలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ సీపీఎం మధురవాడ జోన్ కమిటీ నాయకులు గురువారం రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు సీపీఎం నాయకుడు రాజ్కుమార్తో పాటు పలువురికి అరెస్టు చేసి పీఎంపాలెం స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయమని వారు విమర్శించారు. ఆందోళనలో నాయకులు అప్పలరాజు, గురుమూర్తిరెడ్డి, బి.కొండమ్మ, రాజు, పి.రాము, తదితరులు పాల్గొన్నారు.
తగరపువలసలో సీఐటీయూ రాస్తారోకో
తగరపువలస: కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం తగరపువలసలో సీఐటీయూ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను ముంచివేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.అప్పలనాయుడు, నర్సింగరావు ఎన్.రాము తదితరులు పాల్గొన్నారు.