ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్‌పై అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-12T22:46:34+05:30 IST

ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఇద్దరు ఆల్‌ఖైదా సంబంధిత తీవ్రవాదులను అరెస్ట్ చేయడంపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన...

ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్‌పై అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు

లక్నో: ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను యూపీ పోలీసులను, బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మబోనంటూ ఆయన చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో లక్నోలో వరుస పేలుళ్లకు కుట్రపన్నిన ఇద్దరు అల్ ఖైదా సంబంధిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీస్ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) ప్రకటించిన మరుసటి రోజే అఖిలేశ్ ఈ మేరకు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ‘‘ఉత్తర ప్రదేశ్ పోలీసులు, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలను నేను నమ్మను...’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.


కాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ బీజేపీ మండిపడింది. ‘‘సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎవరైనా ఇంకేం ఆశించగలరు? అఖిలేశ్ యాదవ్ తీవ్ర వాదులను నమ్ముతారు కానీ.. రాష్ట్ర పోలీసులను నమ్మరు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీ పోలీసుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది..’’ అని యూపీ మంత్రి మోహ్సిన్ రజా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం లక్నో శివారులో అల్‌ఖైదా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వాతుల్ హింద్‌‌కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఏటీఎస్ బృందం అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-12T22:46:34+05:30 IST