ఆలమూరు టు దువ్వూరు
ABN , First Publish Date - 2022-01-21T05:20:10+05:30 IST
రుద్రవరం మండలం ఆలమూరు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణ కొనసాగుతోంది.
- అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం
రుద్రవరం, జనవరి 20: రుద్రవరం మండలం ఆలమూరు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణ కొనసాగుతోంది. అమరావతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఆలమూరు గ్రామానికి చేరుకున్నాడు. అతను ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాడు. ఆలమూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇంటింటికి తిరిగి కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బియ్యం సంచులు మార్చి, అధికారులను ఏమార్చి కడప జిల్లా దువ్వూరుకు తరలిస్తున్నారు. ఈనెల 12వ తేదీ పోలీసుల దాడిలో 70 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఇలా తరచుగా రేషన్ బియ్యం పట్టుబడుతున్నా చర్యలు నామమాత్రంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసులు నమోదు చేశాం
ఆళ్లగడ్డ సివిల్ సప్లయ్ పరిధిలో రుద్రవరం, శిరివెళ్ల, గోస్పాడు, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో ఇప్పటి వరకు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. సివిల్ సప్లయ్ చట్టం 6-ఏ కింద కేసులు నమోదు చేశాం. ఆలమూరులో పట్టుబడిన రేషన్ బియ్యం పోలీసు స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకొని సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్కు తరలించాం. ఆయా మండలాల్లో పట్టుబడిన రేషన్ బియ్యాన్ని స్టాక్పాయింట్, డీలర్ల వద్ద నిల్వ ఉంచాం.
- సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ బాలిశ్వర్రావు