ప్రియుడితో సహజీవనం! భర్త నుంచి రక్షించాలంటూ కోర్టుకెక్కిన మహిళ.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2021-08-07T22:27:29+05:30 IST

మరో వ్యక్తితో సహజీవనంలో ఉన్న ఓ వివాహిత తనకు భర్త నుంచి రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.

ప్రియుడితో సహజీవనం! భర్త నుంచి రక్షించాలంటూ కోర్టుకెక్కిన మహిళ.. ఆ తరువాత..

న్యూఢిల్లీ: మరో వ్యక్తితో సహజీవనంలో ఉన్న ఓ వివాహిత తనకు భర్త నుంచి రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. భర్త తనను హింసించడంతోనే తాను మరో వ్యక్తికి దగ్గరయ్యానని కూడా ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రియుడితో కలిసి ఆమె ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఆమె పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..వారి సంబంధాన్ని అక్రమమైనదిగా అభివర్ణించింది. అంతేకాకుండా..ఇటువంటి పిటిషన్ వేసినందుకు ఆమెకు రూ. 5 వేల జరిమానా కూడా విధించింది. 


ఈ కేసుకు సంబంధించి కోర్టు తన తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.  ‘‘ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాం. సహజీవనానికి ఈ కోర్టు వ్యతిరేకం కాదు. కానీ..అక్రమసంబంధాలను మాత్రం మేము వ్యతిరేకిస్తాం. పిటిషనర్‌‌కు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆదేశించడమంటే.. అక్రమ సంబంధాలకు కోర్టు ఆమోదముద్ర వేసినట్టే.’’ అని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. దేశంలోని సామాజిక జీవనానికి భంగం కలిగేలా సహజీవన విధానం ఉండకూడదని కోర్టు ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. ‘‘వివాహ వ్యవస్థకు ఉన్నతమైన స్థానం ఉంది. భర్తతో విభేదాలున్న మహిళ ముందుగా విడాకుల కోసం చట్ట ప్రకారం ప్రయత్నించాలి’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. వేధింపులకు పాల్పడుతున్న భర్తపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత చట్టాలు అవకాశం ఇస్తున్నాయన్న విషయాన్ని కూడా జడ్జీలు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Updated Date - 2021-08-07T22:27:29+05:30 IST