అమ్మకానికి గిరిజన ఇళ్లు
ABN , First Publish Date - 2021-06-19T04:58:25+05:30 IST
స్థలం లేక.. గూడు లేక పొలాల గట్లుపై అవస్థలు పడుతున్న గిరిజనులకు మూడేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన పక్కా ఇళ్లను ఇప్పుడు వైసీపీ నాయకులు అమ్ముకుంటున్న తీరు మండలంలో చర్చానీయాంశమైంది.
2, 3 ఐపేట 18 - గిరిజనుల ఇళ్లు
వైసీపీ నాయకుల ఆగడాలు
ఇందుకూరుపేట, జూన్ 18 : స్థలం లేక.. గూడు లేక పొలాల గట్లుపై అవస్థలు పడుతున్న గిరిజనులకు మూడేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన పక్కా ఇళ్లను ఇప్పుడు వైసీపీ నాయకులు అమ్ముకుంటున్న తీరు మండలంలో చర్చానీయాంశమైంది. మండల కేంద్రమైన ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న రావూరుడొంకలో ఈ అమ్మకాలు సాగుతున్నాయి. మూడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు తొలి విడతలో ఆరు ఇళ్లు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించింది. వీటిని ఆరుగురు కుటుంబాలకు ఇళ్లు కేటాయించారు. ఆ ఆరు కుటుంబాలు అప్పట్లో వేరే పొలాల్లో, ఆక్వా కయ్యల్లో కాపలా కుదరటంతో వారు చేరలేదు. ఈ లోపు ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం రావటంతో అక్కడ వారు అద్దెలకు ఇచ్చారు. రెండేళ్లు అయిందని ఇందుకూరుపేట నాయకులు ఇటీవల వీటిలో నాలుగు ఇళ్లు అమ్మేశారు. నాలుగున్నర అంకణాల స్థలంలో రెండు అంకణాల ఇళ్లను ఒక్కొక్కటి రూ.1.5లక్షలకు వేరే గ్రామస్థులకు అమ్మివేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తహసీల్దారుకు ఇళ్ల అమ్మకాలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన విషయం తెలిసి వైసీపీ నేతలు ఫిర్యాదుదారులపై దాడులకు దిగినట్లు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మండల స్థాయిలో ఎవరూ స్పందించకపోవటంతో వారు ఎమ్మెల్యేను కొవిడ్ సమయంలో కలవటం కుదరదని పోస్ట్లో వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు గిరిజన కాలనీకి చెందిన ప్రజలు తెలిపారు.