వైసీపీ పాలనలో కాపులకు ప్రయోజనం శూన్యం: అనగాని సత్యప్రసాద్
ABN , First Publish Date - 2021-10-14T17:51:51+05:30 IST
వైసీపీ పాలనలో కాపులకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
అమరావతి: వైసీపీ పాలనలో కాపులకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ విద్యార్థులకు విదేశీ విద్య లేదని, నిరుద్యోగ భృతి లేదని అన్నారు. రెండున్నరేళ్లలో కాపులకు ఏంచేశారో చర్చకు రాగలరా? అని అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వానికి సవాల్ చేశారు.
టీడీపీ హయాంలో కాపులకు రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల గౌరవం కల్పిస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కాపు సంక్షేమాన్ని గాలికొదిలారని అనగాని విమర్శించారు. చంద్రబాబు హయాంలో కాపులకు అమలు చేసిన సంక్షేమ పధకాలు రద్దు చేయటమే కాక కార్పొరేషన్ నిర్వీర్యం చేశారన్నారు. నవరత్నాలు అంటూ నలుగురికి అందించిన సంక్షేమ పధకాలే కాపులకు అమలు చేస్తున్నారు తప్ప.. కాపులకు అంటూ ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలు శూన్యమన్నారు. కాపులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తెలుగుదేశం కల్పించిన 5శాతం రిజర్వేషన్లను అడ్డగోలుగా రద్దు చేశారని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.