వరదలో కొట్టుకుపోయిన కారు: ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-09-03T21:43:36+05:30 IST
కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి.
అనంతపురం జిల్లా: కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో రహదారిలోకి వర్షపునీరు రావడంతో దారిలో ప్రయాణిస్తున్న వాహనదారులు గల్లంతయ్యారు. నీటి ఉధృతి దాటికి గొల్లపల్లి దగ్గర కదిరి నుంచి విజయవాడ వెళుతున్న కారు వరదనీటిలో కొట్టుకు పోయింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాషా కుమారుడు బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరో ద్విచక్ర వాహనదారుడు గల్లంతయ్యాడు.
మరోవైపు తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి దగ్గర కదిరి-పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు చెరువులకు గండిపడటంతో వరి పంటలు దెబ్బతిన్నాయి.