కాంగ్రెస్ లో మరో చిచ్చు

ABN , First Publish Date - 2021-03-03T07:24:31+05:30 IST

కాంగ్రె్‌సలో రేగిన తిరుగుబాటు మంటలు చల్లారలేదు. తాజాగా అసొం, బెంగాల్‌ల్లో ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలోని పార్టీలతో పొత్తుపై పార్టీలో చిచ్చు రేగింది. బెంగాల్‌లో అబ్బాస్‌ సిద్దిఖీ అనే ముస్లిం మత పెద్ద ఆధ్వర్యంలో

కాంగ్రెస్ లో మరో చిచ్చు

ముస్లిం పార్టీలతో పొత్తుపై రగడ..మతతత్వంపై భిన్న వైఖరి సిగ్గుచేటు: ఆనంద్‌ శర్మ

బీజేపీ వైపు జీ-23 నేతల మొగ్గు: అధీర్‌ 

నా వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారు: ఆజాద్‌

కాంగ్రె్‌సను చూస్తే జాలేస్తోంది: బీజేపీ


న్యూఢిల్లీ/కోల్‌కతా, మార్చి 2: కాంగ్రె్‌సలో రేగిన తిరుగుబాటు మంటలు చల్లారలేదు. తాజాగా అసొం, బెంగాల్‌ల్లో  ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలోని పార్టీలతో పొత్తుపై పార్టీలో చిచ్చు రేగింది. బెంగాల్‌లో అబ్బాస్‌ సిద్దిఖీ అనే ముస్లిం మత పెద్ద ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎ్‌సఎఫ్‌) అనే పార్టీతో పరోక్షంగానూ, అసొంలో మౌలానా బద్రుద్దీన్‌ అజ్మల్‌ 2005లో ప్రారంభించిన ఆలిండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎ్‌ఫ)తో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దీనిపై అధిష్టానం మీద తిరుగుబాటు చేసిన జీ-23 నేతల్లో ఒకరైన ఆనంద్‌ శర్మ సూటి ప్రశ్నలు సంధించడంతో వివాదం రగిలింది. మూడ్రోజుల కిందట కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో లెఫ్ట్‌- కాంగ్రెస్‌ కూటమి ఓ భారీ ర్యాలీ నిర్వహించింది. సీతారాం ఏచూరి, డి రాజాలతో పాటు బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధీర్‌ రంజన్‌ చౌధురి పాల్గొన్న ఈ సభలో అబ్బాస్‌ సిద్దిఖీ  కూడా పాల్గొన్నారు. ఆయన  నాయకత్వంలో ఏర్పడ్డ ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎ్‌సఎఫ్‌) అనే పార్టీతో కాంగ్రెస్‌ నేరుగా జట్టుకట్టలేదు గానీ వామపక్షాలు మాత్రం తమ కోటా సీట్లలో కొన్నింటిని ఆ కొత్త పార్టీకి కేటాయించాయి. సీపీఎం పొత్తు పెట్టుకుందంటే కాంగ్రెస్‌ కూడా ఐఎ్‌సఎ్‌ఫతో అవగాహనకు వచ్చినట్లేనని  ఆనంద్‌ శర్మ విమర్శించారు. 


అలాంటి మతవాద పార్టీతో దోస్తీ నెహ్రూ, గాంధీ అనుసరించిన లౌకిక విధానాలను దెబ్బతీయడమేనని  ఆక్షేపిస్తూ ‘మతతత్వంపై పోరాడే విషయంలో రకరకాలుగా పార్టీ వ్యవహరించరాదు. మతతత్వం ఏ రూపేణా ఉన్నా మనం ప్రతిఘటించాల్సిందే. అబ్బాస్‌ సిద్ధిఖితో వేదిక పంచుకోవడం సిగ్గుచేటు’ అని ఆయన దుయ్యబట్టారు. ఈ అంశంపై  ముందుగానే వర్కింగ్‌ కమిటీలో చర్చించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై అధీర్‌ రంజన్‌ చౌధురి మండిపడ్డారు. ‘‘కొంతమంది కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత సౌఖ్యాలు చూసుకున్నారు. ఇప్పటికే వారికి పార్టీనుంచి దక్కాల్సిందల్లా లభించేసింది. ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం మొదలెట్టారు. మొదట ఆయనను స్తుతించడం ఆపాలి. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి. నీడనిచ్చి రాజకీయ జీవితాన్ని అందించిన పార్టీని దెబ్బతీయాలనుకోవద్దు.


మీరు చేసే విమర్శలు బీజేపీ ఎజెండాకు ఊతమిస్తాయి.. చూస్తుంటే ఈ జీ-23 నేతలంతా బీజేపీలో చేరాలనుకుంటున్నట్లుంది. అయినా బెంగాల్‌లో కాంగ్రెస్‌ కేవలం వామపక్షాలతో మాత్రమే పొత్తుపెట్టుకుంది. ఇది తెలుసుకోవాలి. సీపీఎం తన సీట్లను వారికిచ్చిందంతే..’’ అని అధీర్‌ ఘాటుగా ట్వీట్ల ద్వారా బదులిచ్చారు. అటు అసోంలో మతతత్వ పార్టీగా ముద్రపడ్డ  ఏఐయూడీఎ్‌ఫతో పొత్తు ఎలా పెట్టుకుంటారని అక్కడ మంగళవారంనాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మీడియా ప్రశ్నించింది. ‘సిద్ధాంతాలు వేరుకావొచ్చు. మేం పొత్తు పెట్టుకున్న పార్టీల అభిప్రాయాలతో మేం 100 శాతం ఏకీభవించకపోవచ్చు. కానీ ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చేసే పనిలో భాగస్వాములమయ్యాం’ అని ఆమె వివరించారు.


బెంగాల్లో ఐఎ్‌సఎ్‌ఫతో పొత్తు విషయమై ధీర్‌ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఆనందశర్మ అభిప్రాయాలపై  స్పందన కోరినపుడు వీటికి మా బెంగాల్‌ అధ్యక్షుడు బదులిచ్చారుగా... అని సమాధానమిచ్చారు. ‘అసొంలో జరుగుతున్నది కాంగ్రెస్‌ బీజేపీ మధ్య పోరు కాదు. అసొం గుర్తింపుకీ, ఆత్మాభిమానానికీ-  బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతాలకీ జరుగుతున్న పోరాటం. అసొం ప్రజల అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే చర్యల్ని బీజేపీ తీసుకుంది. అసొంను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని ప్రియాంక అన్నారు.


అయితే ఆనంద్‌శర్మ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడుతున్నట్లు మంగళవారం రాత్రి స్పష్టం చేశారు. ‘నా ఆందోళనను వ్యక్తపరిచానంతే... సమ్మిళిత, ప్రజాస్వామ్య, లౌకిక సైద్ధాంతిక పునాదులున్న పార్టీ కాంగ్రెస్‌. దీనికి నేనెల్లపుడూ కట్టుబడే ఉన్నాను. ఉంటాను. నాపై అధీర్‌ వ్యక్తిగత దాడి దురదృష్టకరం’ అన్నారాయన. జీ- 23 నేతల్లో ఒకరైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ పార్టీలో భిన్నాభిప్రాయాల్ని తప్పుపట్టారు. రాహుల్‌ గాంధీ వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయన సూచించారు. కాగా- కాంగ్రె్‌సలో రేగిన చిచ్చును రాజకీయంగా సానుకూలంగా మల్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ‘కాంగ్రె్‌సను చూస్తే జాలేస్తోంది. ‘ఒకరేమో లోక్‌సభా పక్ష నేత.. ఇంకొకరు రాజ్యసభలో ఉపనేత. 


ఈ కాంగ్రెస్‌ నేతలిద్దరూ బహిరంగంగా కీచులాడుకుంటున్నారు. ఓ  మతతత్వ పార్టీ (ఐఎ్‌సఎ్‌ఫ)తో చేతులు కలపడంపై వారిలోనే వారికి భిన్నాభిప్రాయాలు... అధీర్‌ అంటే మాకు గౌరవం. ఆయన కాంగ్రె్‌సలో ఉండదగ్గ వ్యక్తి కాదు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఆజాద్‌ లాంటి వ్యక్తులను మందలిస్తారు.. పక్కన పెడతారు. ఇపుడు కాంగ్రెస్‌ అంటే కేవలం నలుగురే. సోనియా, రాహుల్‌, ప్రియాంక, రాబర్ట్‌ వాద్రా... వీరికి సైద్ధాంతిక విలువలు తెలీవు’’ అని పార్టీ ప్రతినిధి సంబిట్‌ పాత్రా వ్యాఖ్యానించారు. 


కశ్మీర్లో పార్టీలో చీలిక!

గులాంనబీ ఆజాద్‌ ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తుతిస్తూ వ్యాఖ్యానించడం జమ్మూ కశ్మీర్‌ కాంగ్రె్‌సలో చిచ్చురేపింది. ఓ వర్గం ఆజాద్‌కు వ్యతిరేకంగానూ, మరో వర్గం ఆయనను సమర్థిస్తూ ప్రకటనలు చేసింది. కశ్మీర్‌ను ముక్కలు చేసిన మోదీని పొగడడమేంటని నిరసిస్తూ వైరి వర్గం ఆజాద్‌ దిష్టిబొమ్మను దహనం చేసింది. బీజేపీ సూచనలకు అనుగుణంగా ఆజాద్‌ పనిచేస్తున్నారని మొహమ్మద్‌ షానవాజ్‌ అనే స్థానిక డీడీసీ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నేతలు ఆరోపించారు. ఇది జరిగిన ఓ గంట తరువాత ఆజాద్‌ విధేయుడైన గౌరవ్‌ చోప్రా అనే నేత ఆధ్వర్యంలో ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ మరో గ్రూపు ధర్నా చేసింది. మరోవైపు- ప్రధానిపై ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వీటికి ఆయన సరైన సమయంలో సరైన చోట వివరణ ఇస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వివరించాయి. 


త్వరలో మోదీ ఉధృత ప్రచారం

బెంగాల్‌, అసొంల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉధృతంగా ప్రచారం చేయనున్నారు. ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించి బెంగాల్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న మోదీ ఆ రాష్ట్రంలో ఏకంగా 20 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. తొలి సభ కోల్‌కతాలోని బ్రిగేడ్‌ గ్రౌండ్స్‌లో  మార్చి 7న జరుగుతుంది. అటు అసోంలో 6 సభల్లో మోదీ ప్రసంగిస్తారు. మోదీతో పాటు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ చౌహాన్‌, యోగి ఆదిత్యనాథ్‌, స్మృతీ ఇరానీ, జేపీ నడ్డా కూడా బెంగాల్లో విస్తృతంగా ప్రచారం జరుపుతారు. 

Updated Date - 2021-03-03T07:24:31+05:30 IST