కరోనాను తొలి దశలోనే గుర్తించే ‘కొవిరాప్‌’

ABN , First Publish Date - 2020-10-22T08:09:18+05:30 IST

కొవిడ్‌ పరీక్షను రూ.500కే చేయడంతో పాటు గంటలోనే కచ్చితమైన ఫలితాన్ని అందించే ‘కొవిరాప్‌’ పరికరాన్ని ఐఐటీ, ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు...

కరోనాను తొలి దశలోనే గుర్తించే ‘కొవిరాప్‌’

  • రూ.500కే టెస్టు.. గంటలో ఫలితం
  • ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణ

కొవిడ్‌ పరీక్షను రూ.500కే చేయడంతో పాటు గంటలోనే కచ్చితమైన ఫలితాన్ని అందించే ‘కొవిరాప్‌’ పరికరాన్ని ఐఐటీ, ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనికి బుధవారం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఆమోదం లభించింది. శరీరంలో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉన్నా ఇన్ఫెక్షన్‌ను గుర్తించగలగడం ఈ పరికరం ప్రత్యేకత. ఫలితంగా కరోనా సోకిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి, వ్యాప్తిని అరికట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. చతురస్రాకారంలో చిన్నపెట్టె సైజులో ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. గ్రామాల్లోనూ కొవిడ్‌ పరీక్షలను విస్తృతంగా నిర్వహించేందుకు ఈ పరీక్ష కిట్‌ ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ రమేశ్‌ పోఖ్రియాల్‌ అన్నారు. దీని తయారీ ఖర్చు రూ.10 వేలే. పెద్ద సంఖ్యలో కొవిరాప్‌ పరికరాలను ఉత్పత్తి చేస్తే తక్కువ ఖర్చు తో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే వీలుంటుందని దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ సుమన్‌ చక్రవర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ పరికరంతో ఒకేసారి 3-10 శాంపిల్స్‌ను పరీక్షించే వీలుంది. ఈ పరికరం ద్వారా కొవిడ్‌తో పాటు మలేరియా, డెంగ్యూ, టీబీ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే వీలుందన్నారు. కొవిరాప్‌ తయారీకి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. - స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-10-22T08:09:18+05:30 IST