చిట్కుల్ చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవానికి ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-01-22T05:19:44+05:30 IST
కోరినవారికి కొంగుబంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచిన మెదక్ జిల్లా చిల్పచెడ్ మండలం చిట్కుల్ మంజీర నది తీరాన వెలసిన చాముండేశ్వరీ అమ్మవారి 39వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి
నేటి నుంచి వేడుకలు షురూ
చిల్పచెడ్, జనవరి 21: కోరినవారికి కొంగుబంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచిన మెదక్ జిల్లా చిల్పచెడ్ మండలం చిట్కుల్ మంజీర నది తీరాన వెలసిన చాముండేశ్వరీ అమ్మవారి 39వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆలయ విశిష్టత
ఉత్తర వాహినియైున మంజీరానది ఒడ్డున వెలసిన చాముండేశ్వరి ఆలయం దక్షిణ భారత దేశంలోనే రెండో పెద్ద చాముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. అమ్మవారి ఆలయానికి 1975లో శంకుస్థాపన చేయగా, 1983 జనవరి 25న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అమ్మవారి విగ్రహం తయారీ కోసం కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ప్రత్యేక శిలలను తెప్పించి తమిళ శిల్పులతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారు. తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి, భవ్యమైన కిరీటంతో 18చేతులతో అమ్మవారి విగ్రహం భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నది. అమ్మవారి ఆ దివ్యరూపాన్ని వీక్షించేందుకు రెండు కళ్లు చాలవని భక్తులు చెప్పుకుంటారు. అమ్మవారికి ఎదురుగా బ్రాహ్మీ, కాళీ, వైష్ణవి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అమ్మవారి ఎదుట హోమం నిర్వహించడంతో పాటు పట్టు పరిచి విశేషమైన పూజలు కూడా ఈ అమ్మవార్ల ముంగిట నిర్వహిస్తారు.