ఆరుగురు మట్కా బీటర్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-06-24T04:51:24+05:30 IST
మట్కా కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నరసయ్య తన సిబ్బందితో దాడి చేసి అరెస్టు చేశారు.
రూ.1,23,420 నగదు, 2 సెల్ఫోన్లు, పట్టీలు స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం, జూన్ 23 : మట్కా కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నరసయ్య తన సిబ్బందితో దాడి చేసి అరెస్టు చేశారు. వీరి నుంచి లక్షా 23 వేల 420 రూపాయలతో పాటు 2 సెల్ఫోన్లు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం టూటౌన్ పోలీ్సస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాదరావు పైవివరాలను వెల్లడించారు. సీఐ నరసింహారెడ్డికి వచ్చిన సమాచారంతో ఎస్ఐ నరసయ్య, సిబ్బంది లక్ష్మీపతిరెడ్డి, హుస్సేనయ్య, శివకుమార్, నాగలక్ష్మిలతో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దస్తగిరిపేటకు వెళ్లగా అక్కడ ప్రశాంత్ అనే వ్యక్తి ఇంటి ముందు మరో ఐదుగురు మట్కా కార్యకలాపాలకు పాల్పడుతుండగా అరెస్టు చేశారన్నారు. అరెస్టు అయిన వారిలో ప్రశాంత్తో పాటు ప్రమీల, బాబు, రాజు, క్రిష్ణపాల్, అబ్దుల్లా ఉన్నారన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నగర బహిష్కరణకు ప్రతిపాదనలు
పట్టణంలో ఇదివరకే అనేక పర్యాయాలు మట్కా కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరిపై నగర బహిష్కరణకు సిఫారసు చేస్తూ జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. పదే పదే పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐ నరసింహారెడ్డి, ఎస్ఐ నరసయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.