టీడీపీ హయాంలోనే పేదలకు భరోసా
ABN , First Publish Date - 2021-06-24T05:43:05+05:30 IST
తెలుగుదేశం పార్టీ హయాంలోనే పేదలకు భరోసా, సమన్యాయం జరిగేదని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు
మాడుగుల రూరల్, జూన్ 23: తెలుగుదేశం పార్టీ హయాంలోనే పేదలకు భరోసా, సమన్యాయం జరిగేదని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. బుధవారం పోతనపూడి అగ్రహారంలో టీడీపీ కరపత్రాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువయ్యేవన్నారు. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, పేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. నిత్యావసర సరకులు, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలందించే విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేసిందన్నారు. కరోనా మృతుల దహన సంస్కరణ ఖర్చులు కూడా అందించకపోవడం దారుణమన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలన్నారు. చంద్రన్న బీమా కొనసాగి ఉంటే కొవిడ్తో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు వచ్చి అందేవన్నారు. కొవిడ్ బాధితులకున్యాయం జరిగే వరకు పోరాడుతామని రామానాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరుకొండ సాంబమూర్తి, మడగల రమణ, రాము, నానాజీ తదితరులు పాల్గొన్నారు.