వ్యాక్సిన్ వచ్చేసిందోచ్..!
ABN , First Publish Date - 2021-04-14T06:49:44+05:30 IST
జిల్లాకు ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. టీకా లేక మూడు రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
జిల్లాకు 35 వేల డోసుల రాక
వ్యాక్సినేషన్ కేంద్రాలకు సరఫరా
బుధవారమే పూర్తికానున్న టీకా పంపిణీ
అనంతపురం వైద్యం, ఏప్రిల్ 13: జిల్లాకు ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. టీకా లేక మూడు రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా టీకా కేంద్రాలు వెలవెలబోయాయి. అధికారులు సైతం వ్యాక్సిన్ రాకపోవడంతో ఏమీచేయలేకపోయారు. ఎట్టకేలకు కేంద్రం.. రాష్ట్రానికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. రాష్ట్ర శాఖ నుంచి జిల్లాకు పంపించారు. జిల్లాకు 35 వేల కోవిషీల్డ్ టీకా డోసులు అందాయి. బుధవారం టీకా ఉత్సవ్ ముగింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ఇప్పటికే కలెక్టర్ గంధం చంద్రుడు.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వైద్య శాఖాధికారులు మంగళవారం ఉగాది పండుగ ఉన్నా.. కరోనా టీకాను జిల్లాలోని అన్ని పీహెచ్సీలకు తరలించారు. వచ్చిన టీకా డోసులు కూడా బుధవారం ఒక్కరోజే పూర్తి చేయనున్నారు. కోవాగ్జిన్ టీకా రాలేదు. దీంతో 2వ డోసు వేయించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాక్సిన్ కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అది కూడా నేడో.. రేపో.. జిల్లాకు చేరే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.