కూలీలపై రసాయనాల నీళ్లు చల్లడంపై స్పందించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-03-30T21:05:22+05:30 IST
ఇతర ప్రాంతాల నుంచి రాయ్బరేలీకి వచ్చిన వలస కూలీలపై రసాయన నీళ్లు చల్లడంపై రాయ్బరేలీ జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ స్పందించారు.
లక్నో : ఇతర ప్రాంతాల నుంచి రాయ్బరేలీకి వచ్చిన వలస కూలీలపై రసాయన నీళ్లు చల్లడంపై రాయ్బరేలీ జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ స్పందించారు. ఈ ఆరోపణలను కచ్చితంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆ వీడియోను తాను చూడలేదని అన్నారు. కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని వలస కూలీలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ఏది చేసినా మార్గదర్శకాల ఆధారంగానే పనిచేస్తున్నామని కలెక్టర్ నితీశ్ స్పష్టం చేశారు.
ఇక, ఇతర ప్రాంతాల నుంచి రాయ్బరేలీకి వచ్చిన వలస కూలీలపై ఓ బస్ స్టేషన్ దగ్గర సోడియం హైపోక్లోరైట్ను నీటిలో కలిపి (రసాయనంతో కూడిన బ్లీచింగ్) అగ్నిమాపక సిబ్బంది చల్లారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ‘కెమికల్ బాత్ (రసాయనంతో స్నానం) చేయిస్తున్నారంటూ అగ్నిమాపక అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నీటిలో సోడియం హైపోక్లోరైట్ను కలిపి పైపుల ద్వారా చల్లాం’’ అని ఓ అధికారి ప్రకటించారు. అయితే ఇది ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చల్లినట్లు ఆయన ప్రకటించారు.