ఆర్టీసీపై కరోనా దెబ్బ
ABN , First Publish Date - 2021-05-15T06:12:03+05:30 IST
చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 25 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
చిత్తూరు రూరల్, మే 14: ఆర్టీసీని కరోనా కోలుకోలేని దెబ్బ తీస్తోంది. జిల్లాలో మొత్తం 15 డిపోలు ఉండగా రోజుకు 1264 సర్వీసులు 5.10 లక్షల కిలోమీటర్లు తిరిగేవి. వీటి ద్వారా రోజుకు రూ.2 కోట్ల మేర ఆదాయం వచ్చేది. రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో ప్రజలు బస్సుల్లో ప్రయాణాన్ని విరమించుకుంటున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 25శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా 342 సర్వీసులకు కుదించారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ విధించడంతో ఆదాయం అమాంతం రూ.14లక్షలకు పడిపోయింది.
1089 మంది ఉద్యోగులకు వైరస్
మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాల్లో 6949 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటి వరకు 1089 మంది వైరస్ బారిన పడ్డారు. 28మంది కరోనాతో మృతి చెందారు.