బీహార్ బాలిక జ్యోతి కుమారిపై సినిమా..
ABN , First Publish Date - 2020-07-02T19:12:05+05:30 IST
లాక్డౌన్ సమయంలో సొంతూరుకు వెళ్లడానికి గాయపడిన..
బీహార్: లాక్డౌన్ సమయంలో సొంతూరుకు వెళ్లడానికి గాయపడిన తన తండ్రిని సైకిల్ మీద కూర్చొబెట్టుకుని.. 1200కిమీ ప్రయాణించిన బీహార్ జ్యోతి గురించి మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆ సంఘటన వల్ల ఆమె ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. ఇవాంకా ట్రంప్ సైతం సోషల్ మీడియాలో జ్యోతిపై ప్రశంసలు కురిపించారు. ఆమె సాహసాన్ని గుర్తించిన సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆ అమ్మాయికి బంపరాఫర్ ఇచ్చినా.. తనకు చదువే ముఖ్యమని వారి విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఇక ఈ విషయం తెలిసిన లోక్ జనశక్తి పార్టీ ప్రెసిడెంట్.. జ్యోతి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్.. జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని కూడా ప్రకటించాడు.
ఇదిలా ఉండగా.. ఆమె జీవితకథ ఆధారంగా శైనే కృష్ణ అనే దర్శకుడు ‘ఆత్మనిర్భర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లీడ్ రోల్గా జ్యోతినే ఎన్నుకున్నారు. గురుగ్రామ్ నుంచి దర్భాంగ వరకు జ్యోతి ప్రయాణంతోపాటు ఆమె పదహేనేళ్ల జీవితంలో జరిగిన సంఘటనలను కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను పలు భాషలలో కూడా విడుదల చేస్తామని శైనీ కృష్ణ తెలిపారు.