బిగ్ బోట్స్ ! స్ర్టోక్ !!
ABN , First Publish Date - 2020-08-05T10:10:57+05:30 IST
కృష్ణానదిలో పెద్ద బోట్లకు అనుమతులిచ్చే విషయంలో పోర్టు అథారిటీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు!
పెద్ద బోట్లను పరిశీలించిన నిపుణుల బృందం
సీ పోర్టు నావల్ ఆపరేషన్ ప్రమాణాలను పాటిస్తే నెలలో అనుమతులు
రివర్ నావల్ ఆపరేషన్ ప్రమాణాలను పాటించాలని ఏపీటీడీసీ భావన
ప్రభుత్వ జోక్యం కోరుతున్న పర్యాటక శాఖ
ఆంధ్రజ్యోతి, విజయవాడ: కృష్ణానదిలో పెద్ద బోట్లకు అనుమతులిచ్చే విషయంలో పోర్టు అథారిటీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు! బోటింగ్ కార్యకలాపాలకు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీ డీసీ) సిద్ధమౌతున్న తరుణంలో పోర్టు అథారిటీ అధికారుల అభ్యంత రాలు ఏపీటీడీసీ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పెద్ద బోట్ల స్థానంలో 50 మంది ప్రయాణించే మెకనైజ్డ్ బోట్లకు అనుమతు లిచ్చే విషయంలోనూ అభ్యంతరాలు వస్తున్నాయి. 10మంది లోపు కూ ర్చునే చిన్నబోట్లకు గతంలోనే అనుమతులు ఇచ్చాయి. నడుస్తున్నాయి కూడా! ప్రస్తుతం సందర్శకులకు అనుమతి లేకపోవటం, కాటేజీలకు మాత్రమే అనుమతులు ఉండటంతో వీటిని బుక్ చేసుకున్న వారిని తరలించేందుకు మాత్రమే చిన్న బోట్లు నడుస్తున్నాయి.
ఏపీటీడీసీ బోటింగ్ యూనిట్ చిన్న బోట్ల ఫ్లీట్ తక్కువ. మీడియం, పెద్ద బోట్ల ఫ్లీట్ ఎక్కువుగా ఉంది. పల్నాడు జలాంతర్గామి క్రూయిజ్, ఫాంటూన్ క్రూయిజ్తో పాటు కృష్ణవేణి, ఆమరపాలి, భవాని మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా బోధిసిరి డబుల్ డెక్కర్ క్రూయిజ్ ఉంది. వీటికి అనుమతులివ్వటంలో పోర్టు అథారిటీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. గోదావరి నదిలో బోటు ప్రమాదం తర్వాత బోట్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించింది. దీన్ని బట్టి చూస్తే పోర్టు అథారిటీ అనుమతులు తప్పనిసరి. అయితే పోర్టు అథారిటీ సీ పోర్టు నావల్ ఆపరేషన్స్ మాదిరిగా నదిలో తిరిగే బోట్ల విషయంలోనూ అనుసరిస్తోంది. సముద్రాలు వేరు. నదులు వేరు. సముద్రాల నావల్ ఆపరేషన్స్ స్థాయిలో కృష్ణానది వంటి వాటిలో బోటింగ్ కార్యకలాపాలకు నావల్ ఆపరేషన్స్ నిర్వహించాలంటే ఆ స్థాయి కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 4 నెలలుగా కరోనా, అంతకు ముందు 3 నెలలు వరదలతో పర్యాటకం పడకేసింది.
దీంతో ఏపీటీడీసీకి ఎలాంటి ఆదాయం లేదు. ఈ పరిస్థితిలో బోట్లకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసే పరిస్థితి లేదు. మంగళవారం హరిత బెర్మ్పార్క్కు వచ్చిన పోర్టు అథారిటీ బృందం బోట్లను పరిశీలించాక ప్రమాణాలను పాటిస్తే నెలరోజుల తర్వాత అనుమతులు వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఒక పక్క పర్యాటకులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో తక్కువ సంఖ్యలో ఉన్న చిన్న బోట్ల ద్వారా పర్యాటకులను తరలించటం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు. సీ పోర్టు నావల్ ఆపరేషన్ కంటే రివర్ నావల్ ఆపరేషన్ ప్రమాణాలను పాటిస్తే సరిపోతుందని ఏపీటీడీసీ భావిస్తోంది.