విచిత్రం: విద్యుత్ అందిస్తున్న ఉత్తరాఖండ్... బిల్లులు వసూలు చేస్తున్న యూపీ!
ABN , First Publish Date - 2021-03-30T13:14:03+05:30 IST
విద్యుత్ లేదు... మీటర్ అంతకన్నా లేదు. ఖాళీగా...
రామ్పూర్: విద్యుత్ లేదు... మీటర్ అంతకన్నా లేదు. ఖాళీగా ఉన్న స్థంభం నుంచి విద్యుత్ బిల్లు వస్తోంది. ఈ విచిత్ర ఉదంతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉన్న రామ్పూర్ జిల్లాకు సంబంధించినది. ఇక్కడి రజ్పూర్ గ్రామంలో ఉంటున్నవారు విద్యుత్ బిల్లుల సమస్యలో చిక్కుకున్నారు. ఈ గ్రామం ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉంది. దీంతో ఉత్తరాఖండ్ నుంచే గ్రామానికి విద్యుత్ సరఫరా కావాల్సివుంది. అయితే ఇప్పుడు కొత్తగా యూపీ విద్యుత్శాఖ వీరికి బిల్లులు ఇస్తూ వస్తోంది.
వివరాల్లోకి వెళితే రామ్పూర్లోని విద్యుత్ విభాగం 2018లో ఈ గ్రామంలో విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేసింది. దీని తరువాత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసి, గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ మీటర్లను కూడా బిగించింది. అయితే ఇంత జరిగినా గ్రామంలోని ఎవరికీ విద్యుత్ సరఫరా కాలేదు. అయితే ఇప్పుడు కొత్తగా యూపీ నుంచి భారీగా బిల్లులు వస్తున్నాయి. దీనిపై స్థానికులు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకోవడంతో విచారణ ప్రారంభమైంది. బాధిత లబ్ధిదారు సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ గ్రామంలో 11 వేల విద్యుత్ లైన్లు వేశారని, విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని వాపోయారు. అయితే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి తమ ఖాళీ విద్యుత్ మీటర్లకు సంబంధించిన బిల్లులు వస్తున్నాయని తెలిపారు. కొందరికి ఆరువేల రూపాయల వరకూ కూడా బిల్లులు వస్తున్నాయన్నారు. అలాగే విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ తమకు ఫోన్ ద్వారా మెసేజ్లు కూడా వస్తున్నాయని వాపోయారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.