అర్ధరాత్రి రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు
ABN , First Publish Date - 2022-01-24T06:30:26+05:30 IST
అర్ధరాత్రి రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు
అడ్డుకున్న కానిస్టేబుల్పై దౌర్జన్యం.. తొమ్మిది మందిపై కేసు
పాయకాపురం, జనవరి 23: అర్ధరాత్రి నడి రోడ్డుపై పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడమే కాకుండా అదేమని ప్రశ్నించిన కానిస్టేబుల్పై దౌర్జన్యానికి దిగిన తొమ్మిది మందిపై నున్న రూరల్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నున్న రూరల్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న సాయి సుందర్కాంత్ శనివారం రాత్రి విధులు నిర్వహిస్తున్నాడు. నున్న గ్రామంలో బీటు నిర్వహిస్తుండగా ఇందిరానగర్లో రోడ్డుపై కొందరు యువకులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై హడావుడి చేస్తుండంపై కానిస్టేబుల్ వారిని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బొక్కా సతీష్ బాబు, కొండేటి వంశీ, ఉయ్యూరు ప్రదీప్తో పాటుగా మరో ఆరుగురు యువకులు కానిస్టేబుల్పై దౌర్జన్యానికి దిగారు. కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా దౌర్జన్యానికి దిగిన తొమ్మిది మంది యువకులపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.