కమలం గూటికి..
ABN , First Publish Date - 2021-06-15T09:49:14+05:30 IST
గులాబీని వదిలిన ఈటల రాజేందర్ కాషాయం ధరించారు. కారు దిగిన ఆయన కమలం చేబట్టారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,
న్యూఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గులాబీని వదిలిన ఈటల రాజేందర్ కాషాయం ధరించారు. కారు దిగిన ఆయన కమలం చేబట్టారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ సమక్షంలో సోమవారం బీజేపీలో చేరారు. ఈటలకు ధర్మేంద్ర ప్రధాన్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. రాజేందర్తోపాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ యూనియన్ సీనియర్ నాయకుడు అశ్వథ్థామ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ నేతలు అందె బాబయ్య, గండ్ర నళిని, శ్రీదేవి, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కేశవరెడ్డి, పలువురు ఓయూ జేఏసీ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. అనంతరం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన అధికారిక నివాసంలో నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈటల రాకతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.
30 మందికే అనుమతి
ఈటల వెంట దాదాపు 250 మంది వరకు నేతలు, కార్యకర్తలు ఢిల్లీ వచ్చారు. కానీ కరోనా ప్రొటోకాల్ నేపథ్యంలోవారిలో దాదాపు 30 మంది నేతలను మాత్రమే బీజేపీ కార్యాలయంలోకి అనుమతించారు. రాష్ట్ర స్థాయి నేతలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కండువా కప్పారు. ద్వితీయ శ్రేణి నేతలు, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, తమను వేదిక మీదికి పిలిచి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో పార్టీలో చేర్చుకోకపోవడం పట్ల పలువురు ఓయూ జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి జిల్లాలో చేరికలుంటాయి: తరుణ్ ఛుగ్
ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో చేరికలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. తెలంగాణ తల్లి బంధ విముక్తి కోసం బీజేపీ చేపట్టే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సోమవారం రాత్రి ఢిల్లీలో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. తనకున్న పాత పరిచయంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశానని ఈటల విలేకరులకు తెలిపారు.