పీఎఫ్ కార్యాలయం ఎదుట బీఎంఎస్ ధర్నా
ABN , First Publish Date - 2022-01-21T04:39:53+05:30 IST
తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మర్రిపాలెం వుడా లేఅవుట్లోని ఈపీఎఫ్వో కార్యాలయం ఎదుట బీఎంఎస్ ఆధ్వర్యంలో ఈపీఎస్-95 పింఛన్దారులు ధర్నా చేశారు.
ఎన్ఏడీ జంక్షన్, జనవరి 20: తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మర్రిపాలెం వుడా లేఅవుట్లోని ఈపీఎఫ్వో కార్యాలయం ఎదుట బీఎంఎస్ ఆధ్వర్యంలో ఈపీఎస్-95 పింఛన్దారులు ధర్నా చేశారు. రూ.వెయ్యి పింఛన్ను రూ.5వేలకు పెంచాలని, ఈపీఎస్ పింఛన్దారులందరికీ కేంద్ర ప్రభుత్వ పఽథకమైన ఆయుష్మాన్ భారత్లో వైద్య సదుపాయం కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఎంఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు మళ్ళ జగదీశ్వరరావు మాట్లాడుతూ ఈపీఎస్-95 ద్వారా వస్తున్న రూ.వెయ్యితో పింఛన్దారులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కొవిడ్ వంటి విపత్కర సమయంలో కూడా రూ.వెయ్యితోనే పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నెట్టుకొచ్చారన్నారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే రూ.వెయ్యి ఏపాటి చిన్నఅవసరానికి కూడా ఉపయోగపడ దన్నారు. మొత్తం పింఛన్దారులు 65 లక్షల మంది ఉండగా, కేవలం 45 లక్షల మందికి మాత్రమే రూ.వెయ్యి ఇస్తున్నారని, ఇది చాలా దారుణమన్నారు. అనంతరం పీఎఫ్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు, ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ అధ్యక్షుడు బొడ్డెటి జగత్రావు, వి.వి.కె.రామ్, అధికసంఖ్యలో పింఛన్దారులు పాల్గొన్నారు.