బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

ABN , First Publish Date - 2021-10-11T06:19:14+05:30 IST

సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం

-లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి

-   రేపటి నుంచి ప్రారంభం 

-  14న స్వామివారి కల్యాణం

-  18న ఆండాలమ్మకు ఒడిబియ్యం

-  20న మహారథోత్సవం, జాతర 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

 సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏటా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలోనూ అదే స్థాయిలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రోజుకో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 14వ తేదీన లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 20వ తేదీన 30 అడుగుల ఎత్తుతో 160సంవత్సరాల చరిత్ర ఉన్న మహారథంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయ ప్రాశస్త్యాన్ని పరిశీలిస్తే మానేరు నదీ ప్రవాహంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే మానేరు ఒడ్డున మాండవ్య మహాముని ఆశ్రమం ఉండేది. మహా విష్ణు యాగం జరపడానికి నిర్ణయించారు. మహా విష్ణు ఆజ్ఞా కోసం మాండవ్య ముని తపస్సు చేయగా మహా విష్ణు ప్రత్యక్షమై మహాయాగం కోసం అనుమతిచ్చాడు. ఆ యాగం తరువాత గ్రామ జమిందార్లు ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత 200 సంవత్సరాల శాలివాహన శకం 1826ప్రాంతంలో మొగలాయిల, కాకతీయుల రాజ్యంపై దండెత్తి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ శ్రీశాల కేశవనాథ స్వామి విగ్రహాన్ని కూడా పగుల గొట్టారు. ఇప్పటికీ ఈ దేవాలయంలో విగ్రహం భద్రపరిచి ఉంది.  ఎంతో పురాతనమైన ఈ దేవాయలంలో 12 వివిధ వాహనాలను స్వామి సేవకు ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 12న పులికాపు, 13న శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు, 14న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, హంసవాహనంపై ఊరేగింపు, 15న  సింహవాహనం, అశ్వవాహనంపై శమిదర్శనం, విజయదశమి వేడుకలు, 16న గరుఢ వాహనం, హనుమంతవాహనంపై స్వామివారి ఊరేగింపు 17 సూర్య వాహనం, కాళింగమర్థనం, చంద్రవాహనాలపై స్వామివారి ఊరేగింపు, 18న అండాళమ్మకు ఒడిబియ్యం, గజవాహనంపై  స్వామివారి ఊరేగింపు, 19న శ్రీరంగనాయ తిరుప్పొళం, పొన్నవాహనంపై స్వామివారి ఊరేగింపు, 20న స్వామివారి మహా రథోత్సవం జాతర, 21న మహాపూర్ణహుతి, చక్రతీర్థం, 22న నాగబలి, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం సుందరకాండ పారాయణం, విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం, లలిత సహస్త్ర పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 


Updated Date - 2021-10-11T06:19:14+05:30 IST