బుచ్చి ‘మున్సిపల్‌’ బరిలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ

ABN , First Publish Date - 2021-10-22T04:15:33+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య పోటాపోటీగా ఎన్నికల పోరు సాగనుంది.

బుచ్చి ‘మున్సిపల్‌’ బరిలో  వైసీపీ, టీడీపీ పోటాపోటీ

అభ్యర్థుల ఖరారులో తెలుగుదేశం పార్టీ ముందంజ

అధికార పార్టీలో కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక 

ఎమ్మెల్యే ముందే నాయకుల వాగ్వాదాలు

 

బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 21 : బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య పోటాపోటీగా ఎన్నికల పోరు సాగనుంది. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఏర్పాటు కాగా.. ఇప్పటికే 70శాతం మేర టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. గురువారం బుచ్చికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రావడంతో ఖరారైన అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని కలలుగన్న నాయకులు, కార్యకర్తల ఆశలు నీరుగారినట్లైంది. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో పలు విషయాలపై చర్చించినా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అయితే అధికార పార్టీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పార్టీ నేతలు ప్రశ్నార్థకంలో ఉన్నారు. కాగా అధికార పార్టీలో రెండు సెగ్మెంట్లలో ఖరారైన అభ్యర్థులపై ఆ వార్డు పరిధిలోని నాయకుల వర్గపోరుతో అభ్యంతరాలు వ్యక్తం చేసుకుంటూ ఎమ్మెల్యే ముందే ఇరువర్గాల నేతలు వాగ్వాదాలకు దిగడంతో విమర్శలకు తావిచ్చింది. ఓ సెగ్మెంట్‌లో ఖరారైన అభ్యర్థి వద్దని ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరో సెగ్మెంట్‌లో ఓ నాయకుడి నాయకత్వం మాకొద్దంటూ వాగ్వాదాలు మొదలయ్యాయి. మొత్తానికి నాయకుల్లో సమన్వయలోపం కారణంగా సమస్యలు మొదలైనట్లు ఆ పార్టీ నాయకుల్లోనే చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-10-22T04:15:33+05:30 IST