కొత్త సందడి
ABN , First Publish Date - 2021-04-14T05:07:39+05:30 IST
ఉగాది రోజు ఏదైనా కొత్త వస్తువు కొంటే.. ఏడాది అంతా శుభపరిణామమే అని కొంతమందికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలో మంగళవారం ఉగాది పర్వదినం పురస్కరించుకుని జిల్లావాసుల్లో చాలామంది కొత్త వస్తువులు కొనుగోలు చేశారు. బంగారం, వెండి ఆభరణాలు, గృహోపకరణాలు, వస్ర్తాలు, ఎలక్ర్టానిక్ పరికరాలను కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లో వినియోగదారుల రద్దీతో ఉగాది శోభ కనిపించింది. మంగళవారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా రూ.60 కోట్ల మేర వ్యాపారం సాగిందని జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్కు ఉగాది శోభ
జిల్లాలో ఒకేరోజు రూ.60కోట్ల మేర వ్యాపారం
బంగారం, వెండి కొనుగోలుదే అగ్రస్థానం
(టెక్కలి/నరసన్నపేట/పాతపట్నం)
ఉగాది రోజు ఏదైనా కొత్త వస్తువు కొంటే.. ఏడాది అంతా శుభపరిణామమే అని కొంతమందికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలో మంగళవారం ఉగాది పర్వదినం పురస్కరించుకుని జిల్లావాసుల్లో చాలామంది కొత్త వస్తువులు కొనుగోలు చేశారు. బంగారం, వెండి ఆభరణాలు, గృహోపకరణాలు, వస్ర్తాలు, ఎలక్ర్టానిక్ పరికరాలను కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లో వినియోగదారుల రద్దీతో ఉగాది శోభ కనిపించింది. మంగళవారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా రూ.60 కోట్ల మేర వ్యాపారం సాగిందని జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుదే అగ్రస్థానమని తెలుస్తోంది. జిల్లాలో 600కు పైగా బంగారం, వెండి దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం, పలాస, సోంపేట, రాజాం ప్రాంతాల్లో బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. సుమారు రూ.30కోట్లకుపైగా విక్రయాలు సాగినట్టు తెలుస్తోంది. పాతపట్నంతో పాటు కొరసవాడ, సీది వంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, నరసన్నపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, హిరమండలాల్లో గృహాపకరణ వస్తువుల విక్రయాలు జోరుగా సాగాయి. చాలామంది ప్యాన్లు, హోమ్ థియేటర్లు, ప్రిజ్లు, టీవీలతో పాటు సెల్ఫోన్లు, కొత్తవాహనాలు కొనుగోలు చేశారు. సామాన్యులు తమ పిల్లలకు సైకిళ్లను కొనుగోలు చేశారు. ఇంకొందరు ఏసీలు, కూలర్లు తదితర ఎలక్ర్టానిక్ పరికరాలను తీసుకున్నారు. మరికొందరు ఉగాది పర్వదినం పురస్కరించుకుని కొత్త వ్యాపారులు ప్రారంభించారు.
ఆఫర్లు ప్రకటించిన షాపులు
నరసన్నపేట, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో బంగారం దుకాణాల యజమానులు ఆఫర్లు ప్రకటించారు. బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేవారికి సిల్వర్ కోయిన్ ఉగాది కానుకగా ఇచ్చారు. మరికొందరు బంగారం వ్యాపారులు ఆభరణాలపై తరుగు శాతాన్ని తగ్గించారు. ఇంకొందరు వ్యాపారులు గృహాపకరణాలకు లక్కీకూపన్లుతో బహుమతులను ప్రకటించారు. ప్రిజ్లు, ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసేవారికి ఆఫర్లు ఇచ్చారు.