రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , First Publish Date - 2020-10-01T07:38:46+05:30 IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా.. సీఎం జగన్ గారూ.. అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. మొదటి ఏడాదే రూ.1,13,000 కోట్ల అప్పు చేశారన్నారు.
జి.కొండూరు, సెప్టెంబరు 30 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా.. సీఎం జగన్ గారూ.. అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. మొదటి ఏడాదే రూ.1,13,000 కోట్ల అప్పు చేశారన్నారు. రెండో ఏడాది బడ్జెట్లో చెప్పిన రూ.48,295 కోట్ల అప్పు 5 నెలల్లోనే దాదాపు పూర్తి చేశారన్నారు. అయినా అభివృద్ధి, సంపద సృష్టి ఏమాత్రం లేదన్నారు. ఖర్చులో 55 శాతం అప్పులేనన్నారు.
ప్రతి ఒక్కరిపై లక్షల ఆర్థిక భారం ప్రభుత్వం మోపిందన్నారు. ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం కారణంగా శ్రీశైలం డ్యాం వద్ద లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు వేలాది ఇళ్లు నీట మునిగి ప్రజలకు, రైతులకు కష్టాలు వచ్చాయన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మూగజీవాలు కొట్టుకుపోవడం, శ్రీశైలం గేట్ల పైన నుంచి నీరు పొర్లడం ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. పోలవరం గడ్డర్ల బిగింపుపై డీడీఆర్పీ అసంతృప్తి, డీడీఆర్పీ, సీఎస్ఎంఆర్ఎస్, పీపీఏ, సీడబ్ల్యుసీలను సంప్రదించే గడ్డర్లు అమర్చారా? సంపూర్ణ అధ్యయనం చేయాలని డీడీఆర్పీ నిర్ణయించిన మాట వాస్తవమేనా? రివ్యూ ప్యానెల్ కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పండి సీఎం గారు.. అని ట్వీట్ చేశారు.