బాబోయ్‌.. కార్‌..!

ABN , First Publish Date - 2020-09-27T09:48:12+05:30 IST

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వెరసి ఎన్డీఆర్‌ మార్గంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదకర మూలమలుపు వద్ద అదుపు

బాబోయ్‌.. కార్‌..!

ఖైరతాబాద్‌ సెప్టెంబర్‌26 (ఆంధ్రజ్యోతి): అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వెరసి ఎన్డీఆర్‌ మార్గంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదకర మూలమలుపు వద్ద అదుపు తప్పి, ఫుట్‌పాత్‌పైకి ఎక్కి విద్యుత్‌ స్తంభాన్ని, చెట్టును ఢీకొని బోల్తా కొట్టి, డివైడర్‌పైకి ఎక్కింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎస్‌ఐ దయాకర్‌ రెడ్డి కథనం ప్రకారం.. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఫార్చ్యునర్‌ కారు (టీఎస్‌ 07 ఈఈ1819) ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ నుంచి తెలుగుతల్లి చౌరస్తాకు వెళ్తుండగా, ఎన్టీఆర్‌ గార్డెన్‌ దాటిన  తర్వా త మూల మలుపు వద్ద అదుపు తప్పింది. కారు తొలుత ఎడమ వైపున ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కి విద్యుత్‌ స్తంభాన్ని, చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్‌ స్టీరింగ్‌ను తిప్పడంతో కుడివైపునకు వచ్చి రోడ్డు మధ్యనున్న డివైడర్‌ ఎక్కి, పల్టీ కొట్టింది.  మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖదీర్‌ (20) తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్తూ ప్రమాదం చేశాడని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్‌ పోలీసులు, క్రేన్‌ సహాయంతో కారును అక్కడి నుంచి తరలించారు. కారును నిర్లక్ష్యంగా నడిపిన యువకుడిపై కేసు నమోదు చేశారు.  కారులోని యువకులంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు.   

Updated Date - 2020-09-27T09:48:12+05:30 IST