కరోనా ముట్టడి.. కానరాదే కట్టడి !

ABN , First Publish Date - 2021-04-20T03:41:53+05:30 IST

రోజురోజుకు కరోనా వేగంగా గ్రామాలను ముట్టడిస్తోంది. పల్లెల్లో పూటకోచోట కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుంటే జనం గుం

కరోనా ముట్టడి.. కానరాదే కట్టడి !

మనుబోలు, ఏప్రిల్‌ 19: రోజురోజుకు కరోనా వేగంగా గ్రామాలను ముట్టడిస్తోంది. పల్లెల్లో పూటకోచోట కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాగైతే కరోనాను ఎలా కట్టడి చేయగలం..రోజులు జరిగేకొద్దీ కేసులు పెరుగుతున్నవే తప్ప కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది.   ఇప్పటికే మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 20పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవికాక ప్రైవేట్‌ వైద్యశాలల్లో, ఇతర ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేసుకుని కరోనాతో అల్లాడుతున్న వారు అధికంగానే ఉన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో, పరిసరాల్లో పం చాయతీ అధికారులు గతంలో లాగా బ్లీచింగ్‌లు,శానిటైజర్‌లు పిచికారీ చేయించడం లేదు. కేసులు ఉన్న ప్రాంతం నుంచి 500మీటర్ల కోర్‌జోన్‌, 1000మీటర్ల బఫర్‌జోన్‌గా చేయడం లేదు. ఇలా చేస్తే ఆ ప్రాంతంలో సంచరించే వారి సంఖ్య తగ్గుతుంది. తద్వారా కరోనా కేసులు తగ్గే ఆస్కారముంది. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంతో జనం  భౌతికదూరం పాటించకుండా తిరుగుతున్నారు. మాస్క్‌లపైన మాత్రమే పోలీసులు దృష్టి సారించి ఉదయం, సాయంత్రం వేళల్లో గంటపాటు మాస్క్‌లు లేనివారిని గుర్తించి జరిమానాలు వేస్తున్నారు. కరోనా కట్టడి చేయాలంటే గతేడాది లాగా పరిమిత ఆంక్షలు విధిస్తే తప్ప మరో దారి లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2021-04-20T03:41:53+05:30 IST