జగన్‌ సొంత జిల్లాలో భగ్గుమన్న వైసీపీ వర్గపోరు

ABN , First Publish Date - 2020-05-28T10:40:09+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు

జగన్‌ సొంత జిల్లాలో భగ్గుమన్న వైసీపీ వర్గపోరు

ఎమ్మెల్యే సమక్షంలోనే డిష్యుం..డిష్యుం 

పరస్పర దాడులతో ఇరువర్గాలకు గాయాలు 

13 మందిపై కేసు నమోదు


బద్వేలు/కాశినాయన మే 27: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇరువర్గాల ఆధిపత్యపోరుతో తలపడ్డాయి. మాటామాటా పెరిగి పరస్పర దాడులకు దిగారు. గ్రామ సచివాలయ భూమిపూజ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి కథనం మేరకు..


బద్వేలు నియోజకవర్గం బి.కోడూరు మండలంలోని మూడు గ్రామాల్లో బుధవారం గ్రామ సచివాలయాలకు భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మొదట ఐత్రంపేట, బి.కోడూరు గ్రామాల్లో భూమిపూజ నిర్వహించిన అనంతరం పాయలకుంట్లకు చేరుకున్నారు. అయితే ఇక్కడి గ్రామ సచివాలయ భూమిపూజపై తనకు సమాచారం లేదని అందువలన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మాజీ జడ్పీటీసీ రామక్రిష్ణారెడ్డి వర్గం కోరింది. భూమిపూజ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించాలని మండల వైసీపీ ఇన్చార్జి యోగానందరెడ్డి వర్గం పట్టుబట్టింది.


దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎమ్మెల్యే ఎదుటే ఇరువర్గాలవారు భౌతిక దాడులకు దిగడంతో భూమిపూజ చేయకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.. ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టి పలువురిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇద్దరు నేతలతోపాటు మొత్తం 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌ పోరుమామిళ్లకు చేరుకుని సంఘటనపై స్థానిక పోలీసులతో సమీక్ష నిర్వహించారు.

Updated Date - 2020-05-28T10:40:09+05:30 IST