చావగొట్టి.. సారీ అన్నారు..
ABN , First Publish Date - 2021-01-18T05:19:28+05:30 IST
ఎందుకొచ్చారో తెలియదు.. ఎందుకు కొట్టారో తెలియదు.. కొట్టడం మధ్యలో ఆపి.. అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి చేతిలో పెట్టి వెళ్లిపోయారు.
చికిత్స కోసం రూ.1000 ఇచ్చారు
ఇన్నర్ రింగ్రోడ్డులో తెల్లవారుజామున ఘటన
గుంటూరు(సంగడిగుంట), జనవరి 17: ఎందుకొచ్చారో తెలియదు.. ఎందుకు కొట్టారో తెలియదు.. కొట్టడం మధ్యలో ఆపి.. అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన గోరంట్ల ఇన్నర్ రింగ్రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలలోకెళితే.. దుగ్గిరాల మండలం కుక్కపల్లివారిపాలేనికి చెందిన పల్లం తేజ అమరావతిలోని ఓ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. శనివారం రాత్రి కారులో తన తల్లిదండ్రులను తీసుకొని ఒక ఫంక్షన్కు వెళ్లాడు. వారిని స్వగ్రామంలో దింపి అమరావతి వెళ్లే క్రమంలో ఇన్నర్ రింగురోడ్డులో కారు పంక్చర్కు గురైంది. దిగి దానిని పరిశీలిస్తుండగా ముగ్గురు యువకులు వచ్చి దాడి చేశారు. ఆ తర్వాత సారీ చెప్పి వెళ్లిపోయారు. గాయపడిన తేజ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు సీఐ వీరాస్వామి తెలిపారు.