ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

ABN , First Publish Date - 2020-08-04T10:46:45+05:30 IST

ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


గూడూరు, ఆగస్టు 3: ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గూడూరు మండలం జులకల్‌ గ్రామంలో జరిగింది. గూడూరు మండలం జులకల్‌ గ్రామానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి ఎంబీఏ  పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్లాడు. అక్కడ హైదరాబాదుకు చెందిన నలుగురు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారు ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి రాఘవేంద్ర రెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు దగ్గర దాదాపు రూ.18 లక్షలు తీసుకున్నారు.


అదిగో.. ఇదిగో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కాలయాపన చేశారు. చివరకు రెండు రోజుల క్రితం రాఘవేంద్రరెడ్డి తదితరులు  హైదరాబాదుకు వెళ్లి డబ్బులు తీసుకున్న నలుగురు వ్యక్తులను డబ్బు వెనక్కి  ఇవ్వాలని అడిగారు. ఆ వ్యక్తులు డబ్బు ఇవ్వమని చెప్పారు. దీంతో   హైదరాబాదు నుండి సొంతూరుకు చేరుకున్న రాఘవేంద్ర రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారక  స్థితిలో ఉన్న రాఘవేంద్రరెడ్డిని  కుటుంబ సభ్యులు  ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం  కోడుమూరుకు తరలించినట్లు ఎస్‌ఐ నాగార్జున తెలిపారు. సోమవారం మృతుని తండ్రి వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2020-08-04T10:46:45+05:30 IST