చెడ్డీ గ్యాంగ్‌కు మూడేళ్ల జైలు...

ABN , First Publish Date - 2021-05-27T13:52:53+05:30 IST

పలు రాష్ట్రాల్లో తిరుగుతూ.. చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠా

చెడ్డీ గ్యాంగ్‌కు మూడేళ్ల జైలు...

హైదరాబాద్‌ సిటీ : పలు రాష్ట్రాల్లో తిరుగుతూ.. చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠా గుమన్‌ గ్యాంగ్‌(చెడ్డి గ్యాంగ్‌)కు హయత్‌నగర్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. ఇదే గ్యాంగ్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఎల్‌బీనగర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌ వెస్ట్‌బెంగాల్‌ నుంచి వలస వచ్చిన గుమన్‌ తెగకు చెందినవారు చోరీలు చేస్తూ జీవనం సాగించేవారు. ముఠాలుగా ఏర్పడి మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలకు రైళ్లలో వెళ్లి నగర శివారు ప్రాంతాల్లో ఉండి పలు కాలనీల్లో రెక్కీ చేసేవారు.


అర్ధరాత్రి అపార్టుమెంట్లు, తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి చోరీలు చేసి రైళ్లలో ఉడాయించేవారు. చోరీలు చేసే సయయంలో వారు ఒంటిమీద దుస్తులు లేకుండా కేవలం చెడ్డీల మీద మాత్రమే వెళ్లేవారు. అందుకే వీరికి చెడ్డీగ్యాంగ్‌ అని పేరు వచ్చింది. గ్యాంగ్‌లో ముఖ్యమైన సభ్యులైన ఏడుగురు చౌహాన్‌ తారాసింగ్‌, సోనూ, బిట్టు, గుప్తాన్‌, సైఫ్‌ అలీ, సిద్ధిక్‌, సాజీద్‌లకు హయత్‌నగర్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది.

Updated Date - 2021-05-27T13:52:53+05:30 IST