ప్రముఖ సినీ నటుడు రాజబాబు కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-26T05:49:10+05:30 IST

సినీ, రంగస్థల, బుల్లితెర నటుడు బొడ్డు రాజబాబు (64) అనారోగ్యంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు.

ప్రముఖ సినీ నటుడు రాజబాబు కన్నుమూత

ద్రాక్షారామ, అక్టోబరు 25: సినీ, రంగస్థల, బుల్లితెర నటుడు బొడ్డు రాజబాబు (64) అనారోగ్యంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయనకు భార్య. ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రామచంద్రపురం మండలం నరసాపురపుపేటలో 1957 జూన్‌ 13న జన్మించిన రాజబాబు చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువతో కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో సభ్యునిగా చేరారు. రంగస్థల నటునిగా పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తండ్రి సినీ నిర్మాత, వ్యాపారవేత్త కావడంతో రాజబాబు ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. సిందూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే,  మురారి, శ్రీకారం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, కల్యాణ వైభోగం, మళ్లీరావా, బ్రహ్మోత్సవం, భరత్‌ అనే నేను మొదలైన 62 చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై వసంతకోకిల, అభిషేకం, రాధామధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం సీరియళ్లలో నటించారు. అమ్మ సీరియల్‌లో నటనకు 2005లో రాజబాబుకు నంది అవార్డు వచ్చింది.  రాజబాబు మృతికి మయూర నాటక కళాపరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్వీ అప్పలాచార్యులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-10-26T05:49:10+05:30 IST