న్యాయవ్యవస్థపై దాడుల్ని లాయర్లు అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-07-03T07:40:28+05:30 IST

న్యాయవ్యవస్థను గౌరవించడమే కాక దురుద్దేశంతో జరిగే ఎటువంటి దాడినైనా

న్యాయవ్యవస్థపై దాడుల్ని లాయర్లు అడ్డుకోవాలి

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ మానవత్వం గల జడ్జి 

వీడ్కోలు సభలో సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థను గౌరవించడమే కాక  దురుద్దేశంతో  జరిగే ఎటువంటి దాడినైనా న్యాయవాదులు  అడ్డుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఇలాంటి దాడులనుంచి వ్యవస్థను కాపాడడంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎపుడూ ముందున్నదని చెప్పారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ గౌరవార్థం శుక్రవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన వీడ్కోలు సభలో జస్టిస్‌ రమణ ప్రసంగించారు.


ఎన్నో గొప్ప తీర్పులిచ్చిన జస్టిస్‌ భూషణ్‌ న్యాయవ్యవస్థపై చెరగని ముద్ర వేశారని, మానవత్వంగల న్యాయమూర్తిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియా డారు. కేసులపై తీర్పులివ్వడం అంత సులభం కాదని, చట్టంతో పాటు చుట్టూ ఉన్న అంశాలు, కేసులో వాస్తవాలను మాత్రమే కాక మనం ఇచ్చే తీర్పు సమాజంపై భవిష్యత్‌లో చూపించే పర్యవసానాల గురించి ఆలోచించాలని సీజేఐ అన్నారు. కాగా, జస్టిస్‌ భూషణ్‌ చారిత్రక అయోధ్య భూవివాదం, ఆధార్‌.. ఇలా అనేక కేసులలో తీర్పులిచ్చిన ధర్మాసనాలలో జడ్జిగా ఉన్నారు. 



గవర్నర్లకు సలహాలివ్వడం మా పనికాదు

రాజ్యాంగంలోని 171వ అధికరణం కింద రాష్ట్ర శాసన మండలికి సభ్యులను నామినేట్‌  చేసే విషయంలో అర్హతలను తాము నిర్ణయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.   అభ్యర్థుల అర్హతల విషయంలో రాజ్యాంగ నిబంధనలను  సవరించలేమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మహారాష్ట్రకుచెందిన జగన్నాథ్‌ శామ్‌రావు పాటిల్‌ అనే హెడ్‌ మాస్టర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.


‘మీరు చెబుతున్న దానికి ప్రత్యేక నిబంధన ఉంది. మేమిక్కడ గవర్నర్‌కు సలహాలివ్వడానికో లేదా మార్గదర్శకాలు నిర్దేశించడానికో లేము. మీరు మమ్మల్ని రాజ్యాంగాన్ని సవరించమంటున్నారా? సారీ!’ అని సీజేఐ రమణ పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-03T07:40:28+05:30 IST