తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న సీఎం

ABN , First Publish Date - 2021-09-18T07:56:17+05:30 IST

ఎన్నడూ లేని విధంగా తిరుమల పవిత్రతను సీఎం జగన్‌ దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణ, టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ ఆరోపించారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న సీఎం
ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

టీటీడీ బోర్డులో నేర చరితులను నియమిస్తారా? 

టీడీపీ నేతల ఆరోపణ 


తిరుపతి(తిలక్‌రోడ్డు), సెప్టెంబరు 17: ‘ధార్మిక సంస్థ అయిన టీటీడీని రాజకీయ సంస్థగా మార్చారు. 80 మంది సభ్యులతో బోర్డును నియమించారు. ఎన్నడూ లేని విధంగా తిరుమల పవిత్రతను సీఎం జగన్‌ దెబ్బతీస్తున్నారు’ అని మాజీ ఎమ్మెల్యే సుగుణ, టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ ఆరోపించారు. టీటీడీ జంబో బోర్డుకు వ్యతిరేకంగా శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. సీఎం జగన్‌ కార్పొరేటర్ల నుంచి భారీమొత్తంలో డబ్బులు తీసుకుని అనర్హులనూ బోర్డు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించి టీటీడీని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని సుగుణ విమర్శించారు. బోర్డులో ఇంతమందిని నియమిస్తే అధికారులు సభ్యులకు సేవ చేయాలా.. లేదా సామాన్య భక్తులకు సేవ చేయాలా అని ప్రశ్నించారు. టీటీడీని వైసీపీ వ్యాపారసంస్థ మార్చి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని జి.నరసింహయాదవ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కపిలేశ్వరాలయంలో రుద్రయాగం చేయడం సరికాదన్నారు. హిందుత్వాన్ని దెబ్బతీసి, క్రిస్టియన్‌ తత్వాన్ని ముందుకు తీసుకొచ్చేలా సీఎం జగన్‌ పాలనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ కలసి టీటీడీని వ్యాపారకేంద్రంగా మార్చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ జంబో బోర్డులో పలువురు నేరచరితులను నియమించడం బాధాకరమని, వీరిపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ చేయించాలన్నారు. లేపోతే బోర్డును రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో టీడీపీ నాయకులు రవినాయుడు దంపూరి భాస్కర్‌యాదవ్‌, మునిరామయ్య, మునిశేఖర్‌రాయల్‌, రమణరాజుయాదవ్‌, మనోహరాచ్చారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T07:56:17+05:30 IST