తమిళనాడు విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఉచితం : పళనిస్వామి

ABN , First Publish Date - 2021-01-11T01:07:37+05:30 IST

తమిళనాడులో కళాశాల, పాలిటెక్నిక్ విద్యార్థులకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం

తమిళనాడు విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఉచితం : పళనిస్వామి

చెన్నై : తమిళనాడులో కళాశాల, పాలిటెక్నిక్ విద్యార్థులకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం శుభవార్త చెప్పారు. 2021 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలోని దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందుతారని చెప్పారు. 


ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని కళాశాలలు, పాలిటెక్నిక్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రోజుకు 2 జీబీ చొప్పున డేటాను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం ఈ నెల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు అమలవుతుంది. ఈ పథకం వల్ల సుమారు 9 లక్షల మంది ప్రయోజనం పొందుతారు. కోవిడ్-19 మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులను విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 


ఈ పథకం ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్స్‌లో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు వర్తిస్తుందని ఈ ప్రకటన పేర్కొంది. ప్రైవేటు కళాశాలల్లో చదువుతూ ఉపకార వేతనాలు పొందుతున్నవారిని కూడా ఈ పథకంలో చేర్చుతామని తెలిపింది. విద్యార్థినీ, విద్యార్థులకు డేటా కార్డులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందజేస్తామని తెలిపింది. 


Updated Date - 2021-01-11T01:07:37+05:30 IST